సచివాలయ కూల్చివేతపై మీడియా బులిటెన్ ఇస్తాం: హైకోర్టుకు ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కూల్చివేత వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని నిబందనలు చెబుతున్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు.
తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వాలన్న పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కాగా, ప్రభుత్వ బులిటెన్లో వివరాలు సమగ్రంగా ఉండవని పిటిషనర్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన కోర్టు.. టూర్ ఏర్పాటు చేసి మీడియాను తీసుకెళ్లగలరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే, జర్నలిస్టులను అనుమతిస్తే వారికి ప్రమాదాలు జరగవచ్చని, అందరూ గుమిగూడి కరోనా నిబంధనల ఉల్లంఘన జరగవచ్చని ఏజీ కోర్టుకు తెలిపారు. చుట్టుపక్కల ప్రైవేటు భవనాలపై నుంచి కూడా చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటు భవనాలపై నుంచి చిత్రీకరిస్తే అడ్డుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది,
Recommended Video
కాగా, సచివాలయం కింద నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని, అది నిజమో కాదో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను శనివారానికి వాయిదా వేసింది.