షాకింగ్ : లాక్ డౌన్ వేళ అధికారుల మందు పార్టీ.. బాగోతం బయటపడింది..
లాక్ డౌన్ వేళ సామాన్య మందు బాబులే కాదు కొంతమంది అధికారులు కూడా మందు లేక బెంగటీలుతున్నట్టున్నారు. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలుచేయాల్సిన అధికారులే.. లాక్ డౌన్లోనూ మందు పార్టీలు చేసుకుంటుండటం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి అధికారుల బలహీనతల వల్లే.. రాష్ట్రంలో అర్దరాత్రి వేళల్లో అక్కడక్కడ గుట్టుచప్పుడు కాకుండా మద్యం సప్లై జరుగుతోందనడంలో అతిశయోక్తి లేదేమో. తాజాగా ఖమ్మంలో వెలుగుచూసిన ఘటనతో ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మంలో అధికారుల మందు పార్టీ
ఖమ్మం జిల్లాలో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి 8 మంది అధికారులు కలిసి ఓచోట మందు పార్టీ చేసుకున్న వైనాన్ని మీడియా బట్టబయలు చేసింది. ఈ 8 మంది అధికారులు కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో విధులు నిర్వహిస్తున్నవారే కావడం గమనార్హం. విధులు ముగిశాక... అంతా ఒక్కచోట చేరి పార్టీ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే మీడియాకు సమాచారం అందడంతో... కొంతమంది జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ అధికారులు అక్కడినుంచి పారిపోయారు.
ఖరీదైన మద్యం బాటిళ్లు
మీడియాను చూడగానే ఓ అధికారి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కున్నట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు అతను అందులోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. కొంతసేపటికి మీడియా ప్రతినిధులు గట్టిగా తలుపు బాదడంతో.. బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ పారిపోయినట్టు సమాచారం. అక్కడున్న మద్యం బాటిల్స్ను చూసి మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. టేబుల్పై పరిచిన బాటిల్లే కాదు వంట గదిలో ఓ మూలన కూడా ఖరీదైన మద్యం బాటిళ్లు ఉన్నట్టు గుర్తించారు.
ఎక్కడినుంచి సప్లై...
ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో... అధికారులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాక్ డౌన్లో ప్రజలకు కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పిస్తూ కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులే.. ఇలా రాత్రివేళల్లో మందు పార్టీలు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. మద్యం దుకాణాలు,బార్లు మూసి ఉన్న వేళ... ఈ అధికారులకు ఎవరు మద్యం సప్లై చేస్తున్నారన్నది సస్పెన్స్గా మారింది. దీని వెనకాల ఉన్న లింకులను లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పలుచోట్ల బయటపడుతున్న లిక్కర్ సప్లై
రాష్ట్రంలో లాక్ డౌన్లోనూ పలుచోట్ల అక్రమ లిక్కర్ దందా వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవలే కొడంగల్లో అక్రమంగా కర్ణాటక నుంచి మద్యం సప్లై చేస్తున్నవారిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్లోనూ ఓ వ్యక్తి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తూ పట్టుబడ్డాడు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లో దాదాపు నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. కొంతమంది మద్యం వ్యాపారులు సీక్రెట్ ఏజెంట్స్ను నియమించుకుని.. సాధారణ ధరల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువకు మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Recommended Video