మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి
Recommended Video
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు నేటికీ చల్లారటం లేదు . ఇక ఇదే సమయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల, రాజకీయ పార్టీల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల అనంతరం వరుసగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ విద్యార్థులు ఫలితాలతో ఆత్మహత్యలకు పాల్పడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడ్డారు . ఇంటర్ బోర్డు అధికారుల వైఖరికి నిరసనగా విద్యార్థులు, రాజకీయ పార్టీల ఆందోళనలతో రాష్ట్రం హోరెత్తింది . ఇంతా జరిగితే దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన తేల్చి చెప్పారు. ఇది కేవలం మీడియా చేసిన అసత్య ప్రచారం అని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు పరిశీలించగా ఫలితాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లకు, ఆత్మహత్యలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు అన్న అశోక్ .. రీ వెరిఫికేషన్ లో ఎలాంటి తప్పులు దొరకలేదని వివరణ
ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన 53మంది విద్యార్థుల జవాబుపత్రాలను నిశితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించగా ఇంటర్ బోర్డు నుండి చెప్పుకోదగ్గ తప్పిదం జరిగినట్టు తేలలేదని అశోక్ స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటన కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెప్తున్నా, ఆ విద్యార్థులు జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్లో కానీ రీ-కౌంటింగ్లో కానీ ఎలాంటి తప్పిదం బయటపడలేదని చెప్పారు. గ్లోబరీనాతో పాటు టెక్ మెథడక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వేర్వేరుగా 12 కేంద్రాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దినట్టు అశోక్ చెప్పారు. ఈ రెండు సంస్థలు నిర్వహించిన రీ-వెరిఫికేషన్..రీ-కౌంటింగ్లో ఫలితాలు ఒకేలా ఉన్నాయని వివరించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తమదైన శైలిలో వివరణ ఇచ్చారు .ఆత్మహత్యకు పాల్పడిన 25మంది విద్యార్థుల్లో 10మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కాగా 12 మంది విద్యార్థులు ఒకటికి మించిన సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని చెప్పారు.85శాతం మార్కులు వచ్చినా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అశోక్ చెప్పారు. ముగ్గురు విద్యార్థులు పాస్ అయినా ఆత్మహత్యకు పాల్పడినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.
మీడియా అసత్య ప్రచారం .. ఫలితాలలో జరిగిన తప్పిదాలు ఆత్మహత్యలకు కారణం కాదు అన్న ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్
ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాల రీ-వెరిఫికేషన్.. రీ-కౌంటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. మే 10వ తేదీలోగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత 15 రోజులకు స్కాన్ చేసిన జవాబు పత్రాలు ఇస్తామన్నారు. ఫలితాల్లో తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వేలాది మంది ఫెయిల్ అయ్యారని మీడియా అసత్య ప్రచారం చేస్తోందని అశోక్ మండిపడ్డారు. విద్యార్థులకు ఆత్మహత్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి మీడియా అసత్య కథనాలతో ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ తాజా వ్యాఖ్యలపై విద్యార్థులు,తల్లిదండ్రులు, రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.