మీర్పేట ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు, మహిళతో తప్పుగా ప్రవర్తించడంతో చర్యలు..
పోలీసు.. అంటే రక్షణ కల్పించాలి. కానీ కొందరి వ్యవహార శైలితో మంచిగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల మీర్పేట ఏఎస్సై నరేంద్ర బాధ్యతారహిత్యంగా ప్రవర్తించారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. శాఖపరమైన విచారణ జరుపగా, మిస్ బిహేవ్ చేసినట్టు తేలింది. దీంతో అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ స్పష్టంచేశారు.
ఇటీవల ఓ కేసు విషయమై మీర్పేట ఏఎస్సై నరేంద్ర ఇంటికెళ్లారు. అయితే మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. తనలో ఉన్న పాడుబుద్ధిని బయట పెట్టాడు. అసలే పోలీసు అధికారి, అయినా వద్దని మహిళా వారించింది. తనతో నరేంద్ర ప్రవర్తనతో వివాహిత విసిగిపోయింది. తనకు జరిగిన అన్యాయంపై షీ టీమ్స్లో ఫిర్యాదు చేసింది. కేసు విషయం, నరేంద్ర ప్రవర్తన గురించి వారికి పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో షీ టీమ్స్ కేసును రాచకొండ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. శాఖపరమైన విచారణ జరిపారు.
మహిళతో నరేంద్ర తప్పుగా ప్రవర్తించారని తేలింది. దీంతో వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. తప్పు చేస్తే చర్యలు తప్పవని, ఏ స్థాయిలో ఉన్న అధికారులపైనా అయినా సరే చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఇటీవల వరసగా పోలీసు అధికారులు సస్పెన్షన్కు గురవుతున్నారు. కొందరు తప్పుగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇదిలాఉంటే వరంగల్ జిల్లాలో రెండురోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. వరంగల్ డీసీపీ నాగరాజు, ఏసీపీ సారంగపాణిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.