Owaisi: ఇక బరిలో మజ్లిస్: పౌరసత్వ చట్టానికి నిరసనగా: పోలీసుల అనుమతిపైనే..!
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బరిలో దిగబోతోంది. శనివారం జంటనగరాల్లో భారీ ప్రదర్శనను నిర్వహించడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. జంటనగరాలకు మాత్రమే పరిమితం కాకుండా.. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లల్లోనూ మహా ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసులు అనుమతి ఇవ్వడంపై ఈ మహా ప్రదర్శన భవిష్యత్తు ఆధార పడి ఉంది.
మీ ఆస్తులు వేలం వేసి, నష్టాన్ని భర్తీ చేసుకుంటాం: ఆందోళనకారులపై ఆదిత్యనాథ్ నిప్పులు
యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ అధినేతలతో..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మహా ప్రదర్శనను నిర్వహించడంపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ అధినేతలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ పాతబస్తీలోని దారుస్సలాంలో గల మజ్లిస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీకి చెందిన ఎనిమిది మంది అధినేతలు, ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు.
మహా ప్రదర్శన ఎలా ఉండలానే అంశంపై
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన మహా ప్రదర్శన తీరు తెన్నులపై ఇందులో చర్చిస్తున్నారు. ఈ సవరణ చట్టం వల్ల భారత ముస్లింలకు ఎలాంటి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ముస్లిం సామాజిక వర్గంలో అధికశాతం మంది నిరక్షరాస్యులు కావడం వల్లే.. వారికి సైతం అర్థం అయ్యేలా ఈ చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
హింసకు అవకాశం లేకుండా..
సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు చేపట్టిన ప్రదర్శనలు హింసాత్మకంగా రూపాంతరం చెందాయని, ఈ పరిస్థితిని తమ ప్రదర్శనలో రానివ్వకూడదని అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. ఏ ఒక్క హింసాత్మక సంఘటనకు గానీ, అవాంఛనీయ పరిస్థితులకు గానీ అవకాశమే లేని విధంగా, శాంతియుతంగా నిరసన ప్రదర్శను నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకలోని మంగళూరులో చెలరేగిన హింసాత్మక ప్రదర్శనల్లో ముగ్గురు ముస్లింలు మరణించారని, అలాంటి వాతావరణం లేకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు.
పోలీసులు అనుమతి ఇస్తేనే..
తాము నిర్వహించ తలపెట్టిన మహా ప్రదర్శనకు ఆయా రాష్ట్రాల పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదని ఒవైసీ వెల్లడించారు. పోలీసులు అనుమతి ఇస్తేనే.. ప్రదర్శనను చేపడదామని, లేకపోతే.. దాని స్థానంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసనను వ్యక్తం చేద్దామని ఒవైసీ.. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులకు సూచించారు. అనంతరం- దశలవారీగా తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఒవైసీ చెప్పుకొచ్చారు.