టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్థిక సాయం.. ఆ కోరిక నెరవేరలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న భార్య...
కరోనాతో మృతి చెందిన నటుడు,సినీ జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నర్సింహారెడ్డి) కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల కింద రూ.1లక్ష ఆర్థిక సాయం అందించారు. తన మేనేజర్ ద్వారా ఆ డబ్బును టీఎన్ఆర్ కుటుంబానికి అందజేశారు.
టీఎన్ఆర్ చివరి ఫోన్ కాల్... 'అది చెబుదామనే ఫోన్ చేశా...' సోషల్ మీడియాలో వైరల్...
ఈ సందర్భంగా టీఎన్ఆర్ భార్య, కుటుంబ సభ్యులతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. యూట్యూబ్లో టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలను తాను చూశానని చిరంజీవి తెలిపారు. ఓపికగా,హుందాగా ఆయన ఇంటర్వ్యూలు చేసే విధానం తనను ఎంతగానో ఆకట్టుకునేదని గుర్తుచేసుకున్నారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతోమందికి స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. టీఎన్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
మెగాస్టార్ అందించిన ఆర్థిక సాయానికి టీఎన్ఆర్ భార్య ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పట్ల టీఎన్ఆర్కు ఉన్న అభిమానాన్ని ప్రస్తావించారు. తన 200వ ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవితో చేయాలన్నది టీఎన్ఆర్ డ్రీమ్గా చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీఎన్ఆర్ అనే వ్యక్తి గురించి మెగాస్టార్ దృష్టిలో పడిందని.. ఎంతో ప్రేమతో తనకు ఫోన్ చేసి ఓదార్చారని తెలిపారు. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చారని... అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. టీఎన్ఆర్ను గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన టీఎన్ఆర్ కరోనాతో సోమవారం(మే 10) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టీఎన్ఆర్ మరణం తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
టీఎన్ఎఆర్ స్వగ్రామం మంచిర్యాల జిల్లా పౌనూరు గ్రామం. 1990లలోనే ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కెరీర్ ఆరంభంలో నటుడు,రచయిత ఎల్బీ శ్రీరామ్ వద్ద సహ రచయితగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు పలు టీవీ ఛానెళ్లలో క్రైమ్ ఎపిసోడ్స్కు డైరెక్టర్గా వ్యవహరించారు. ఇప్పుడిప్పుడే నటుడిగా సినిమాల్లో రాణిస్తున్నారు. ఇటీవలి హిట్ సినిమా జాతిరత్నాలు సహా దాదాపు 20 సినిమాల్లో నటించారు. దర్శకత్వం చేయాలన్న ట్రయల్స్లో ఉండగానే ఆయన కన్నుమూశారు. దర్శకుడు కావాలన్న కలతో సినీ పరిశ్రమకు వచ్చిన ఆయన ఆ కల నెరవేరకుండానే కన్నుమూశారు.