దాసరి బాటలో మెగాస్టార్..! సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్ర..! ముఖ్యమంత్రులతో సఖ్యత అందుకేనా..?
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి..! ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఓ బ్రాండ్ ఉంది. సినీ వినీలాకాశంలో కనీ వినీ ఎరుగని మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు అందులో ప్రధాన భూమిక పోషించారు మెగాస్టార్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దృవతారాలుగా సినీ పరిశ్రమను శాసిస్తున్న సమయంలో తన వైవిధ్యమైన ప్రతిభను ప్రదర్శించి, స్వయంకృషితో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. నటన, నృత్యాలు, ఫైటింగ్, ఆహార్యంలో తాను చూపిన ప్రత్యేకతకు తెలుగు ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. అందుకు తగ్గట్టుగా సుప్రీం, మెగాస్టార్ లాంటి పేర్లతో చిరంజీవిని తమ గుండెల్లో పెట్టుకున్నారు ప్రేక్షకులు.
దాసరి బాద్యతలు బుజాన వేసుకున్న చిరంజీవి.. పరిశ్రమ అభివృద్ది కోసం కృషి..
తర్వాత పరిస్ధితులు మారిపోయి కొంత కాలం చిరంజీవి చిత్ర పరిశ్రమకు దూరమైనా, తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అంతే కాకుండా సైరా లాంటి దేశభక్తి సినిమాతో తాను మళ్లీ దేశవ్యాప్తంగా సత్తా చాటుకుని చరిత్ర సృష్టించారు చిరంజీవి. తాజాగా సిని పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఇండస్ట్రీ అభివృద్దికి స్వయంగా ప్రణాళికలు రచిస్తున్నారు చిరంజీవి. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన మూవీ ఆర్టీస్టు అసోసియేషన్ సభలో చిరంజీవి వినూత్మంగా స్పందించారు. పరిశ్రమ అభివృద్దికి తాను ఎంత అంకితభావంతో ఉన్న అంశాన్ని చెప్పడమే కాకుండా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశంపై చాలా సున్నితంగా స్పందించారు చిరంజీవి.
నటీనటుల్లో క్రమశిక్షణ ఉండాలి.. పరిశ్రమలోని సమస్యలపై దృష్టి పెట్టిన మెగాస్టార్..
'మా' సమావేశంలో హీరో రాజశేఖర్ వ్యవహరించిన తీరుపట్ల చిరంజీవి అభ్యంతరం చెప్పడం, స్పందించిన విధానం గమనిస్తే తెలుగు పరిశ్రమ ఐక్యతకు, అభివృద్దికి స్వర్గీయ దాసరి నారాయణ రావు అనుసరించిన విధానాలను చిరంజీవి అనుసరించబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దాసరి అకాల మరణం తర్వాత పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు ఎవ్వరూ అంతాగా ఆసక్తి చూపించలేదు. కాని చిరంజీవి ఇప్పుడు దాసరి నారాయణ రావు నిర్వహించిన బాద్యతలను బుజాన వేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఓ పక్క సమస్యల పరిష్కారం, మరో పక్క పరిశ్రమ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల గురించి చిరంజీవి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 'మా' సమావేశంలో లోలోపల ఆయన మదన పడుతున్నా హీరో రాజశేఖర్ పట్ల క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించాలని పేర్కొనడం పరిశ్రమలోని ఐక్యతకు మెగాస్టార్ ఎంత కట్టుబడి ఉన్నారో స్పష్టమవుతోంది. గతంలో దాసరి నారాయణ రావు కూడా ఇవే అంశాల పట్ల పరితపించే వారని తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల సీఎంలతో సఖ్యత.. పరిశ్రమ విస్తరణపై సీఎంలతో హామీ తీసుకున్న చిరు..
అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తూ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడే అంశాలను చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల పట్ల పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఏకాంగా ముఖ్యమంత్రులతో చర్చలు జరపడం హర్షించదగ్గ అంశమని పలువురు సినీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పరిశ్రమ మరింత అభివృద్దికి తీసుకోవాల్సిన విధానాలపై ఓ హామీ తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను వివిధ షూటింగ్ లకు అనుకూలంగా మరింత అభివృద్ది చేయాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని సీఎం చంద్రశేఖర్ రావుతో చర్చలు జరిపి, సానుకూల హామీని పొందినట్టు తెలుస్తోంది.
దాసరి స్పూర్తిగా చిరంజీవి అడుగులు.. చిత్ర పరిశ్రమ అభివృద్దే ద్యేయంగా కార్యాచరణ..
దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలని, అందుకోసం స్టూడియోల నిర్మాణం అవసరమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి మంతనాలు జరిపినట్టు సమాచారం. చిరంజీవి ప్రతిపాదనలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో చిరంజీవి సమక్షంలో స్టూడియోల నిర్మాణాలకు రూపకల్పన జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పరిశ్రమ అభివృద్దితో పాటు నటీ నటుల మద్య ఐక్యత కోసం సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇవే బాద్యతలను గతంలో సర్వీయ దాసరి నారాయణ రావు నిర్వహించి పరిశ్రమకు పెద్దదిక్కుగా వ్యవహరించారు. అదే పాత్రను ఇప్పుడు చిరంజీవి తీసుకోవడం గొప్ప పరిణామంగా చర్చ జరుగుతోంది.