మీరా కుమార్ కంటతడి, కెటిఆర్ టార్గెట్: అసలు నేరెళ్లలో ఏం జరిగింది?
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావును టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు నేరెళ్ల ఘటనపై విమర్శల దాడికి పూనుకున్నాయి. సిరిసిల్ల కెటిఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఆ ఘటనకు ప్రాధాన్యం చేకూరిందని అనుకోవచ్చు.
కాంగ్రెసు నేత మీరా కుమార్ నేరెళ్లను సందర్శించి, బాధితులను పరామర్శించారు. జైలులో ఉన్నవారిని పరామర్శించారు. దీంతో సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అసలు నేరెళ్ల ఘటన పూర్వపరాలేమిటనేది ఆసక్తి కలిగించే విషయమే.
ఇసుక దందా కారణంగానే నేరెళ్ల ఘటన పురుడు పోసుకున్నట్లు కనిపిస్తోంది. ఇసుక లారీల కింద పడి కొంత మంది మరణించిన ఘటనలు ప్రజల ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితి విషమించి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే స్థితికి చేరుకుంది.
దళిత రైతు మరణించాడు...
జూలై 2వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల క్రాస్రోడ్ వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల గ్రామానికి చెందిన దళిత రైతు బద్నాపురం భూమయ్య మరణించాడు. దీంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇసుక లారీల ప్రమాదాల్లో తరుచుగా మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన నెల రోజుల్లోనే నేరెళ్లకు చెందిన నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
Recommended Video
మొర పెట్టుకున్నా..
ప్రమాదాల కారణంగా ఆ దారిలో ఇసుక లారీల రవాణా నిలిపివేయాలనీ, చెక్పోస్టులు పెట్టాలనీ స్థానికులు అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించే నాథుడే లేకుండా పోయాడు. ఈ అంశంపై పరిసర గ్రామాలకు చెందినవారు ధర్నాలు కూడా చేశారు. తాజాగా భూమయ్య మరణం అగ్నికి ఆజ్యం పోసింది. వారు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు తంగళ్లపల్లి, జిల్లెల్ల, రాంచంద్రాపూర్ గ్రామస్తులు తోడయ్యారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారి....
వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆరు లారీలకు నిప్పుపెట్టారు. కొన్ని లారీల అద్దాలను పగులగొట్టారు. ఈ సమయంలో తంగళ్లపల్లి ఎస్సై సైదయ్యతో పాటు పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్పీ విశ్వజిత్ కంపాటి రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి తేవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. దాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
వారిపై కేసులు పెట్టి...
లారీలకు నిప్పుపెట్టిన ఘటనతో ఎనిమిదిమందికి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించి, వారిని తర్వాతి రోజు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో నేరెళ్ల గ్రామానికి చెందిన కోల హరీష్, గంధం గోపాల్, పెంట బాణయ్య, పసుల ఈశ్వర్కుమార్, చెప్యాల బాలరాజు ఉన్నారు. అదే విధంగా జిల్లెల్ల గ్రామానికి చెందిన కోలకంటి గణేష్, చీకోటి శ్రీనివాస్, రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన బత్తుల మహేశ్ ఉన్నారు. ఆ ఎనిమిది మందిని పోలీసులు జులై 9వ తేదీన వేములవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధిస్తూ కరీంనగర్ జిల్లా జైలుకు తరలించాలని సూచించింది.
బిజెపి నేతలు ఇలా...
బిజెపి నాయకులు బాధిత కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తీసుకుని వచ్చారు. ఎస్పీ విశ్వజిత్ కంపాటితోపాటు సీఐలు, మరో 18 మంది కానిస్టేబుళ్లు కలిసి నిందితులను చిత్రహింసలకు గురిచేశారని నిందితుల కుటుంబాలకు చెందినవారు చెప్పారు. నాలుగు రోజులపాటు వారిపై థర్డ్డిగ్రీ ప్రయోగించారని కూడా చెప్పారు. పోలీసు దెబ్బలకు చాలమంది ఎముకలు విరిగిపోయాయనీ, వారు శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారనీ బాధితుల కుటుంబ సభ్యులు చెప్పారు.
కెటిఆర్ టార్గెట్
నేరెళ్ల ఘటనతో ప్రతిపక్షాలు మంత్రి కెటిఆర్ను లక్ష్యం చేసుకున్నాయి. జరిగిన సంఘటనకు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకువేసి నేరెళ్ల ఘటనను జాతీయస్థాయిలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడానికి పూనుకుంది.
అందులో భాగంగానే...
నేరెళ్ల ఘటనను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేసేందుకు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకులు మీరా కుమార్ను తీసుకుని వచ్చారు. మీరా కుమార్ బాధితులను పరామర్శించారు. కంటతడి పెట్టారు. జైలులో ఉన్నవారిని పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రాని తెచ్చుకుంది ఇందుకేనా అని ఆమె ప్రశ్నించారు.