బ్రోతల్ కేసులు అంటూ ఏడ్చేశారు: మీరా కుమార్ కంటతడి, ఇలాంటి తెలంగాణ కోరుకోలేదు
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల బాధితులను లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పరామర్శించారు.
హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల బాధితులను లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పరామర్శించారు. ఇలాంటి తెలంగాణ కోరుకోలేదన్నారు.
లారీ ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబంతో పాటు పోలీసులు అరెస్టు చేసిన మాజీ సర్పంచ్ బానయ్య, కోల హరీష్, గోపాల్, చెప్యాల బాలరాజు, చికోటి శ్రీనివాస్, గణేష్, మహేష్లను, వారి కుటుంబాలను కలిశారు.
కన్నీటిపర్యంతం
మీరా కుమార్ రావడంతో అక్కడి వారు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా చొరబడి తమ భర్తలను తీసుకు వెళ్లారని కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తమపై బ్రోతల్ కేసులు పెడతామని భయపెట్టారని, కులం పేరుతో దూషించారన్నారు.
Recommended Video
చలించిన మీరా కుమార్
బాధితుల ఆవేదనను చూసి మీరా కుమార్ చలించిపోయారు. ఆమె కూడా కంటతడి పెట్టారు. మీకు అండగా ఉంటానని, తెలంగాణ ఇఛ్చింది ఇసుక మాఫియా కోసం కాదని, తెలంగాణ ఇస్తే మహిళలకు ఎంతో గౌరవం లభిస్తుందని ఆశించామని, కానీ ఇప్పుడు తెలంగాణలో సిగ్గుచేటు పరిస్థితులు ఉన్నాయన్నారు.
నా బిడ్డల్లా ఉన్నారని
మీరంతా నా బిడ్డల్లా ఉన్నారని చెబుతూ చిన్నారులను ఎత్తుకున్నారు మీరా కుమార్. లారీలు ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబానికి రూ.50 వేలు, బాధితుల కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
జైల్లో పరామర్శ
కాగా, నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. కానీ సభకు ప్రభుత్వం నో చెప్పింది. అయినప్పటికీ సభ జరుపుతామని కాంగ్రెస్ చెప్పింది. జిల్లాల నుంచి జన సమీకరణ చేసింది. అందరినీ పోలీసులు అడ్డుకున్నారు. సిరిసిల్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు మీరా కుమార్ కరీంనగర్ జైలుకు చేరుకొని, బాధితులను పరామర్శించారు.