ఆ ఇద్దరు.. కన్నేస్తే.. 'క్యాష్' స్వాహా!: లిఫ్ట్ ఇస్తామని పెద్ద షాకే ఇస్తారు..
హైదరాబాద్: ఒకరు నిరుద్యోగి.. మరొకరు ఆటో డ్రైవర్.. ఇద్దరూ చేతులు కలిపారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్నవారే వీరి టార్గెట్. లిఫ్ట్ ఇస్తామంటూ బైక్ ఆపుతారు. మెల్లిగా మాటలు కలుపుతారు.
మాటల్లో పెట్టి జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్తారు. బైక్ ఆపి.. తాము పోలీసులమని నకిలీ ఐడీ కార్డులతో బెదిరిస్తారు. అడిగినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తారు. నిలువు దోపిడీ చేసి అక్కడినుంచి పరారవుతారు.
ఎవరా ఇద్దరు?:
బోడుప్పల్ వాసి ముసునూరి కాశీ విశ్వనాథ్, అదే కాలనీలో ఉంటున్న కోటిబాబు అనే ఇద్దరు ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నారు. విశ్వనాథ్ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుండగా.. కోటిబాబు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈజీ మనీ కోసం ఈ ఇద్దరూ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.
ఒంటరి వ్యక్తులే టార్గెట్:
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తులను వీరు టార్గెట్ చేస్తారు. లిఫ్ట్ ఇస్తామని వారిని బైక్పై ఎక్కించుకుంటారు. ఆపై జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరిస్తారు. నకిలీ ఐడీ కార్డులు బయటకు తీసి.. తాము పోలీసులమని నమ్మిస్తారు. అడిగినంత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతారు. చివరకు దొరికిన సొమ్ముతో అక్కడినుంచి ఉడాయిస్తారు.
రూ.5లక్షలు చోరీ:
ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలో రూ. 15 వేలు, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో రూ.5లక్షల వరకు ఈ ఇద్దరూ కలిసి దోపిడీ చేసినట్లుగా కాచిగూడ పోలీసులు తెలిపారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలోను వీరిద్దరిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇవి స్వాధీనం:
దారి దోపిడీలకు పాల్పడుతున్న ఈ ఇద్దరిని కాచిగూడ పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. నిందితుల నుంచి రూ.2.97లక్షలు, నకిలీ పోలీస్ ఐడీ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిని మాండ్కు తరలించినట్లు సమాచారం.