ఘోరం: స్విమ్మింగ్ నేర్పిస్తానని అక్క పిల్లలను చంపేసిన మేనమామ, షాకింగ్ రీజన్!
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ నేర్పిస్తానంటూ తీసుకొచ్చి మానసిక వికలాంగులైన కవల పిల్లలను సొంత మేనమామే హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతులకు 12ఏళ్ల క్రితం మానసిక వికలాంగులైన సృజనరెడ్డి, విష్ణువర్థన్రెడ్డి జన్మించారు. వారు మాట్లాడలేరు.
స్విమ్మింగ్ నేర్పిస్తానంటూ..
కాగా, ఆ పిల్లలిద్దరిని స్విమ్మింగ్ నేర్పిస్తానంటూ మేనమామ మల్లికార్జున్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని చైతన్యపురిలోని తను అద్దెకుంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి తన రూమ్మేట్ వెంకట్రామిరెడ్డి సాయంతో వారిద్దరినీ హత్య చేశాడు.
మృతదేహాలను తరలిస్తూ..
అయితే, అర్థరాత్రి వేళ వారి మృతదేహాలను కారులో ఎక్కిస్తుండగా ఇంటి యజమాని మహేశ్రెడ్డి ఏమైందని ప్రశ్నించాడు. కూల్ డ్రింగ్ అనుకుని విషం తాగారని, పిల్లలకు ఆరోగ్యం బాగోలేనందు వల్ల ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కొంత తడబడుతూ చెప్పాడు. దీంతో వారి తీరుపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు..
ఈ క్రమంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మల్లికార్జన్రెడ్డి, అతడి రూమ్మేట్ వెంకట్రామిరెడ్డి, కారు డ్రైవర్ వివేక్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా, పిల్లల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు, ఇంటివద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
చంపిన తర్వాత బావకు ఫోన్ చేశాడు
కాగా, ఆ పిల్లల వల్ల తన అక్కా, బావలు ఇబ్బంది పడుతున్నారనే ఈ హత్యలకు పాల్పడినట్లు మల్లిఖార్జున్ రెడ్డి పోలీసులకు తెలిపాడు. పిల్లలను హతమార్చిన తర్వాత మల్లిఖార్జున్ రెడ్డి తన బావకు ఫోన్ చేసి పిల్లలను చంపేశానని చెప్పాడు.
కాగా, పిల్లల హత్య సమాచారాన్ని పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు చైతన్యపురి పోలీస్స్టేషన్కు వచ్చారు. పిల్లలు మానసిక వికలాంగులు అయినప్పటికీ వారిని బాగానే చూసుకుంటున్నామని.. తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవని వారు పోలీసులకు తెలిపారు.
విచిత్రంగా స్పందించిన నిందితుడి అక్కా, బావ
తమ పిల్లలను హత్య చేసినప్పటికీ మల్లికార్జున్రెడ్డిపై వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. తక కంటే కూడా మల్లిఖార్జున్ రెడ్డి తమ పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపేవాడని, అయితే, తమ కోసం పిల్లలను చంపానని చెప్పడం సరికాదని పిల్లల తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంతేగాక, పోయినవారు ఎలాగూ తిరిగిరారు కాబట్టి తన తమ్ముడిని వదిలేయాలని చిన్నారుల తల్లి లక్ష్మి పోలీసులను కోరడం గమనార్హం. అయితే, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తర్వాత హత్యలకు సంబంధం ఉన్న ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.