సుర్రుమంటున్న సూరీడు..వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..
Recommended Video
సూరీడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. భగభగ మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో గాలిలో తేమ శాతం తగ్గింది. దీంతో ఉష్ణోగ్రత పెరిగి వడగాలులు తీవ్రమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
సాధారణం కన్నా 7డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కన్నా 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు. సోమవారం ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 46డిగ్రీలు దాటాయి. వేసవితాపం పెరుగుతున్నందున మంగళ, బుధ, గురువారాల్లో వడగాలులు వీచే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నల్గొండలో ఏడుగురు మృతి
మండే ఎండలకు జనం పిట్టలా రాలిపోతున్నారు. ఉక్కపోత, వడదెబ్బలకు మృత్యువాతపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో వడదెబ్బ కారణంగా సోమవారం ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలంలో ఇద్దరు, భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, భైరవునిబండ గ్రామాల్లో ఇద్దరు కన్నుమూశారు. సూర్యపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన చిన్న వెంకన్న వడదెబ్బతో ప్రాణాలు విడిచాడు. అటు ఏపీలో ఇప్పటి వరకు 17మంది మృతి చెందారు.
పెరుగుతున్న ఎండలతో జనం బెంబేలు
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలుల దెబ్బకు జనం బయట అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రి 7 దాటినా వడగాలుల ప్రభావం ఉంటుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నందున జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు., ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని, ఎక్కువగా నీళ్లు తీసుకొని శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని అంటున్నారు.