కాంగ్రెస్పై కరుణ.. కలుపుకునేది లేదు..! ఫలితాల తర్వాతే ఫోకస్ అంటున్న కేసీఆర్..!!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ మీద కన్నెర్ర చేయడం ఆపేసారు. అందులో భాగంగా టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి బ్రేకులు పడ్డట్టే అనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం కొలువుతీరుతుందనే అంశంపట్ల స్పష్టత వచ్చిన తర్వాతనే స్థానిక పరిణామాలపై ఆలోచిద్దామని సన్నిహితులతో చంద్రశేఖర్ రావు చర్చించినట్టు తెలుస్తోంది. యూపీఏతో కలిసి నడిచేందుకే చంద్రశేఖర్ రావు విలీనాన్ని వాయిదా వేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలతో చంద్రశేఖర్ రావు తన మనసు మార్చుకున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాతే విలీనంపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఉభయ సభల్లో ప్రతిపక్షం లేకుండా చూడాలని టార్గెట్ పెట్టుకున్నట్టు వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే..!
విలీనం లేదు..గిలీనం లేదు..! జర ఆగుదామన్న కేసీఆర్..!!
ఇప్పటికే శాసనమండలిలో సీఎల్పీని విలీనం చేసుకోగా.. శాసనసభలోనూ విలీనం కోసం పావులు కదిపింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది పార్టీకి రాజీనామా చేశారు. మరో ఇద్దరు పార్టీ మారితే అసెంబ్లీ లెక్కల ప్రకారం ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు అసలు ఎల్పీనే ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ తతంగాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ భావించారు. అయితే తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీఎల్పీ విలీన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..! మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ..!!
ఆర్థిక అక్రమాలకు పాల్పడుతూ అవినీతి సొమ్ముతో విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన సమయం దగ్గర్లోనే ఉందన్నారు. టీఆర్ఎ్సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్తో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను బుధవారం ప్రారంభించారు.
పెద్దకొత్తపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభం..! ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన భట్టి...!!
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రశేఖర్ రావు అప్రజాస్వామిక ధోరణితో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పథకంలో అడ్డగోలుగా అంచనాలు పెంచి దాని ద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ రావు అవినీతి సొమ్ముకు ఆశపడి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పార్టీ ఫిరాయించారని బీరంకు ఏమాత్రం నైతికత ఉన్నా తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడుతాం..! ప్రజాస్వామ్య యాత్రలో గొంతెత్తిన కాంగ్రెస్ నేతలు..!!
కాంగ్రెస్ పార్టీపై ఉన్న అపారమైన నమ్మకంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజానీకం బీరం హర్షవర్ధన్రెడ్డిని గెలిపించుకున్నారని, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన బీరం హర్షవర్ధన్రెడ్డి ఎమ్మెల్యే పదవిని వదులుకున్నంత వరకు పోరాటం ఆగదన్నారు. ప్రజలను వంచించిన బీరం హర్షవర్దన్రెడ్డిపై ప్రతి మండలంలో కేసులు నమోదు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలనే కుట్రను అమలు చేస్తున్న చంద్రశేఖర్ రావు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.చంద్రశేఖర్ రావు ను ఇంటిదారి పట్టించే వరకు విశ్రమించేది లేదన్నారు.