రోహిత్ మెరిట్ స్టూడెంట్: జనరల్ కోటాలో సీటు
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ కులంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనను తాను షెడ్యూల్ కులానికి చెందిన వాడినని అడ్మిషన్ ఫారంలో రోహిత్ చెప్పుకున్నాడు. కానీ అతను మెరిట్ కోటాలో సీటు పొందాడు.
రోహిత్ ఎస్సీ సర్టిఫికెట్ను సమర్పించలేదని పోలీసులు అంటున్నారు. మెరిట్ కోటాలో సీటు పొందడం వల్ల ఆ అవసరం కూడా అతనికి రాలేదు. వేముల రోహిత్ వడ్డెర కులానికి చెందినవాడు కాగా, తల్లి మాల కులానికి చెందిందనే విషయాన్ని మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్ కూడా చెప్పారు.
వడ్డెర కులం బిసీ జాబితాలోకి వస్తుంది. దీన్నే బిజెపి, ఎబివిపి కార్యకర్తలు వివాదంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వేముల రోహిత్ తల్లి రాధిక మాత్రం తాము ఎస్సీలమని చెప్పింది. రోహిత్ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి రాధిక రోహిత్ను పెంచి పెద్ద చేసింది. రిజర్వేషన్ల ప్రయోజనం కోసమైనా ఎస్సీ తల్లి కుమారుడిని ఎస్సీగా పరిగణించాలని చెబుతోంది.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టడంతో రోహిత్ కులాన్ని వివాదంగా మార్చారని అర్థమువుతోంది. తాము రోహిత్ స్వస్థలానికి చెందిన తాహిసిల్దార్ నుంచి వివరణ కోరుతామని పోలీసులు అంటున్నారు.