మెతుకుసీమలో బలోపేతమే లక్ష్యం: ‘హస్తం’ నేతలకు ‘గులాబీ గాలం’
సీఎం కే చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెతుకుసీమ. తెలంగాణ ఉద్యమ సారధిగా గత ఎన్నికల్లో సబ్బండ వర్ణాల మద్దతు సంపాదించగలిగారు. అధికార పగ్గాలు చేపట్టారు. మూడేళ్లు దాటింది.
హైదరాబాద్: సీఎం కే చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెతుకుసీమ. తెలంగాణ ఉద్యమ సారధిగా గత ఎన్నికల్లో సబ్బండ వర్ణాల మద్దతు సంపాదించగలిగారు. అధికార పగ్గాలు చేపట్టారు. మూడేళ్లు దాటింది. మరో ఏడాదిన్నర ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే 'మళ్లీ' సెంటిమెంట్ పూర్తిగా ఎజెండాగా ప్రజాతీర్పు కోరాలంటే కష్టమే. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో చేసిన ప్రగతి ప్రజలకు చూపితేనే విశ్వసిస్తారు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. దళితుల ఆత్మగౌరవం కోసం మూడెకరాల భూమి పంపిణీ చేయాలని మరో సంచలన పథకం అమలుకు పూనుకున్నారు.
మెతుకు సీమ జిల్లా పక్కనే ఒక జిల్లాలో 55 వేల కుటుంబాలు అర్హత సాధిస్తే కేవలం 216 కుటుంబాలకు ఇప్పటికీ పంపిణీ చేసిన నేపథ్యం సర్కార్ది. మిషన్ భగీరథ మొదటి దశ కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయకుంటే ఓటడగనని ప్రతీన బూనిన పట్టుదల సీఎం కేసీఆర్ది. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రజాతీర్పును తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే రాజకీయ వ్యూహం అమలు చేయడమే పరిష్కారమని సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ భావిస్తున్నదని విమర్శలు ఉన్నాయి.
ఆ దిశగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెతుకు సీమ జిల్లా పరిధిలో కొద్దోగొప్పో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కార్యాచరణ టీఆర్ఎస్ చేపట్టింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో టీఆర్ఎస్ నాయకులు చర్చలు సాగించినట్టు తెలిసింది. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీలైన ఈ ఇద్దరు నాయకులు 'కారు' ఎక్కితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయొచ్చని గులాబీ దళం భావిస్తున్నది. అంతేగాదు వారు ప్రాతినిధ్యం వహించిన రెండు అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నాయకత్వం బలమైన నమ్మకంతో ఉన్నది.
ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫర్మ్
కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీలతో టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ చర్చలు జరిపినట్టు తెలిసింది. సదరు మాజీ మంత్రి సతీమణి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అంశం కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు వినికిడి. మాజీ మంత్రికి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం టిక్కెట్టు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అంగీకరించినట్టు తెలిసింది. ఆయన సతీమణికి కూడా మెదక్ జిల్లాలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టిక్కెట్టు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారమవుతున్నది. రాష్ట్ర మంత్రి మండలిలోనూ చోటు కల్పిస్తామని కూడా మాజీ మంత్రికి పార్టీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ పరిస్థితులను బట్టి పార్లమెంట్ స్థానం.. అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు వినికిడి.
భవిష్యత్పై సందేహాలు ఇలా
టీఆర్ఎస్ నుంచి ఆఫర్ బాగానే ఉన్నా ఆ పార్టీలో చేరే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జిల్లా రాజకీయాలలో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు నాయకులు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్న డైలామాలో ఉన్నారు. మాజీ మంత్రి మాత్రం కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. శంషాబాద్లో ఇటీవలే జరిగిన కాంగ్రెస్ శిక్షణ శిబిరానికీ సదరు మాజీ మంత్రి ఇలా వచ్చి అలా వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంపై మాజీ మంత్రి వ్యవహరించిన వైఖరిపై పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సమావేశానికి మాజీ ఎంపీ గైర్హాజరవడం కూడా అనుమానాలకు తావిస్తున్నది.
ఆ మూడు సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీ ఫామ్లు కష్టమేనా?
సంగారెడ్డి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో, మెదక్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో సిట్టింగ్లకు టీఆర్ఎస్ అధి నాయకత్వం టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు రెండు విడతల్లో నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి అనుకూలంగా ఉందని, అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులను చేర్చుకుని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
చర్చలు ఫలిస్తే...
టీఆర్ఎస్ నేతల చర్చలు ఫలించి, కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేరితే వారికి సంగారెడ్డి జిల్లాలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి టిక్కెట్లు ఇవ్వాల్సి వస్తుంది. మాజీ మంత్రి సతీమణికి కూడా మెదక్ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి, టిక్కెట్టు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఏదేమైనా కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీఆర్ఎస్ సంప్రదింపులు ఇప్పుడు జిల్లాలో హాట్టాపిక్గా మారింది.