వివాదాలెందుకు? ఇది హ్యాపీ టైమ్: మెట్రోపై కేటీఆర్, 2.15ని.కి లాంచ్ చేయనున్న మోడీ
ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రారంభిస్తున్న వేళ తాను వివాదాల జోళికి వెళ్లబోనని, ఇది ఆనందించాల్సిన విషయమని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు.
హైదరాబాద్: ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రారంభిస్తున్న వేళ తాను వివాదాల జోళికి వెళ్లబోనని, ఇది ఆనందించాల్సిన విషయమని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. మెట్రో రైలు హైదరాబాద్కు రావడానికి కారణం కాంగ్రెస్ చేసిన కృషేనని, తమ హయాంలోనే సర్వే, కాంట్రాక్ట్, సగం పనులు ముగిశాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ పై విధంగా స్పందించారు.
మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే!
మెట్రో కోసం సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ఓ మణిహారంలా నిలుస్తుందని, ఇది తమ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవమని కేటీఆర్ అన్నారు. మెట్రో రైలు కారణంగా హైదరాబాద్ మరింత అభివృద్ది సాధిస్తుందని అన్నారు.
మెట్రో ఛార్జీలు తక్కువే..
అతిథులు వస్తున్న కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి, నగరవాసులు సహకరించాలని మంత్రి కోరారు. మిగితా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఇక్కడ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. అనతి కాలంలోనే మెట్రో సేవల ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఆ తర్వాత విజయం, వైఫల్యం గురించి మాట్లాడితే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.
ప్రత్యేకతలెన్నో.. గమ్యస్థానాలకు 17లక్షల మంది..
మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి పెద్ద మైలురాయి కాబోతున్నదని, ఇంతపెద్ద ప్రాజెక్టు కొనసాగుతున్నప్పుడు బాలారిష్టాలు తప్పవని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. స్కైవాక్లు, స్మార్ట్బైక్లు, మెట్రో మార్కెట్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని, విడుతల వారీగా అన్నీ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. ప్రతిరోజూ నగరంలోని 17 లక్షల మందిని మెట్రో గమ్యస్థానాలకు చేరుస్తుందని చెప్పారు. నగర జనాభాలో 17 శాతం ప్రజానీకం మెట్రోవల్ల ప్రయోజనం పొందనున్నారన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
మెట్రోరైలును మంగళవారం ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో మియాపూర్ మెట్రో స్టేషన్లో కొనసాగుతున్న ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ సోమవారం పర్యవేక్షించారు. షెడ్యూలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సూచించారు. హెలిప్యాడ్, పైలాన్, ప్రారంభ వేదిక, మెట్రో ట్రాక్ తదితర ప్రదేశాలను పరిశీలించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజల స్వప్నమైన మెట్రో రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్సింగ్ పూరి, గవర్నర్ నరసింహన్ కలిసి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అంతా సిద్ధం
బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకొంటారని సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, నగర మేయర్ ప్రధానికి స్వాగతం పలుకుతారని చెప్పారు. అక్కడి నుంచి వారంతా 35 నిమిషాల్లో మియాపూర్కు చేరుకుంటారన్నారు. ఈ మేరకు మియాపూర్లో మూడు హెలిప్యాడ్లను సిద్ధంగా ఉంచామన్నారు.
మెట్రో ప్రారంభం.. మోడీ, గవర్నర్, కేసీఆర్ ప్రయాణం
మంగళవారం మధ్యాహ్నం 2.15నిమిషాలకి మెట్రోసర్వీస్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని, సీఎం ఇతర ప్రముఖులు కూకట్పల్లి వరకు మెట్రోలో ప్రయాణించి తిరిగి మియాపూర్కు చేరుకుంటారని చెప్పారు. అక్కడినుంచి మాదాపూర్లోని జీఈఎస్ ప్రాంగణానికి చేరుకుంటారన్నా రు. నగరంలో 9 గంటల పాటు ప్రధాని పర్యటన కొనసాగుతుందని, ఇప్పటికే ఎస్పీజీ భద్రతా బలగాలు నగరాన్ని అదుపులోకి తీసుకొని భద్రతను పర్యవేక్షిస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.