మెట్రో షాక్: ఉగాదికి లేదు, ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యాకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు ఉగాదికి తొలి దశ ప్రారంభమవుతుందని నగర ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ ఉగాదికి తొలి దశ మెట్రో రైలు పరుగు పెట్టడం లేదని చెబుతున్నారు. ఈ ఉగాదికి మెట్రో రైలు ప్రారంభం కావడం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం చెప్పారు.
కొన్ని ఇబ్బందుల దృష్ట్యా మెట్రో రైలును దశల వారీగా ప్రారంభించలేమని ఆయన చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యాక మెట్రో రైలును ప్రారంభిస్తామని చెప్పారు.
కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు మార్చి 21వ తేదీ నుంచి కూత పెడుతుందని అందరు భావించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజు నుంచి అది అధికారికంగా పట్టాలు ఎక్కుతుందనుకున్నారు.
మొదటి దశ మెట్రో రైలు ఆ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. హైదరాబాదులోని నాగోలు నుంచి మెట్టుగుడా వరకు ఈ రైలు నడుస్తుందని చెప్పారు.
ఇటీవల నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లను ప్రయోగాత్మకంగా టెస్ట్ రన్ చేశారు. ఆగస్టు నుండి పలు టైస్ట్ డ్రైవ్లు చేస్తున్నారు. ఏటీవోను ఇటీవల తొలిసారి పరీక్షించారు. ఈ నేపథ్యంలో ఉగాది నుండి ఈ మెట్రో ప్రారంభమవుతుందని భావించారు. కానీ మెట్రో మొత్తం ఒకేసారి ప్రారంభిస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.