విషాదం: మెట్రోస్టేషన్లో పెచ్చులూడి పడి మహిళ మృతి, నెలన్నర రోజుల క్రితమే పెళ్లి
హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం పడుతుందని తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిల్చున్న మహిళ తలపై.. మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
నేరుగా తలపై పడటంతో..
ఆమెతోపాటు ఉన్న ఆమె సోదరి, ఇతర ప్రయాణికులు ఆమెను వెంటనే సమీపంలోని ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఆ మహిళ తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మృతి చెందిన మహిళ కూకట్పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. ఆమె స్వస్థలం మంచిర్యాల.
పెను విషాదంలో కుటుంబసభ్యులు
ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారంతా అక్కడకు చేరుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఇలా విగతజీవిగా పడివుండటాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నెలన్నర రోజుల క్రితమే వివాహం..
మౌనికకు నెలన్నర రోజుల క్రితమే వివాహమైనట్లు సమాచారం. ఇది ఇలావుంటే, కొత్తగా కట్టిన మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి పడటం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అసలు తమకు సరైన భద్రత ఉందా? అని నిలదీస్తున్నారు. ఉన్నత ప్రమాణాలు పాటించామని, అవార్డులు వచ్చాయని ప్రకటించుకుంటున్న మెట్రో అధికారులు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మెట్రో భద్రతపై అనుమానాలు..
మెట్రో నిర్మాణ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.
పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు మెట్రో అధికారులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.