పేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూత
హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. ఐఏఎస్ అధికారిగా బీఎన్ యుగంధర్ కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో పలు కీలక శాఖల్లో పనిచేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా పనిచేసిన సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
బీఎన్ యుగంధర్ 1962వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్లో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం నాటి ప్లానింగ్ కమిషన్నే నేడు నీతి ఆయోగ్గా పిలుస్తున్నాం. గ్రామీణప్రాంత అభివృద్ధిశాఖలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. పేద ప్రజల వైపున ఆయన నిలిచారు. అయితే ఆయన కమ్యూనిస్టు కాదు కానీ కొన్ని కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయని గతంలో సత్యనాదెళ్ల తన తండ్రి గురించి చెప్పారు. తన కెరీర్ మొత్తం బలహీనవర్గాలు, పేద ప్రజలకోసమే యుగంధర్ పనిచేశారు. గ్రామాల్లో వాటర్ షెడ్ల నిర్మాణం కోసం రాష్ట్రాల జోక్యం లేకుండా నేరుగా కేంద్రం నుంచే నిధులు వెళ్లేలా ప్రణాళిక రచించారు యుగంధర్. మసూరిలోని డెహ్రాడూన్లోని లాల్బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడెమీ డైరెక్టర్గా కూడా సేవలందించారు యుగంధర్.
1983-85 మధ్య బీఎన్ యుగంధర్ నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు కార్యదర్శిగా పనిచేశారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేదలకు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం వెనక వ్యూహరచన చేసింది బీఎన్ యుగంధర్ కావడం విశేషం. గుంటూరు జిల్లా నాదెళ్ల నుంచి అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామానికి యుగంధర్ తండ్రి వలస వెళ్లారు. ఇందుకోసమే వారి ఇంటిపేరు బుక్కాపురం నాదెళ్ల అనేది అయ్యింది.ఇప్పటికీ బుక్కాపురంలో యుగంధర్కు వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. యుగంధర్ తన కొడుకు అయిన సత్యనాదెళ్లను బుక్కాపురంతో సంబంధాలు కొనసాగించాలని చెబుతూ అప్పుడప్పుడు అక్కడికి సత్యనాదెళ్లను తీసుకొచ్చేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు.
తన మిత్రుడు మరో ఐఏఎస్ అధికారి అయిన కేఆర్ వేణుగోపాల్ కుమార్తెను ఇచ్చి సత్యనాదెళ్లకు వివాహం చేశారు యుగంధర్. పీవీ నరసింహారావు హయాంలో గ్రామీణశాఖ యుగంధర్ చేపడితే సంక్షేమ శాఖ కార్యదర్శిగా వేణుగోపాలు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఇద్దరూ కలిసి వారికి అప్పగించిన శాఖల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.