మార్చి మొదటి వారం నుండే ఒంటిపూట బడులు.. విద్యాశాఖ నిర్ణయం
రానున్నది వేసవి కాలం . ఎండలు మండే కాలం . గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం వుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ అభిప్రాయపడుతుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపిన తరువాత నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
గత ఏడాది మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులను ప్రారంభించింది విద్యాశాఖ. అయితే ఈసారి మాత్రం ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకవారం ముందుగానే ఒంటిపూట బడులను ప్రారంభించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే మరోవైపు అకడమిక్ కేలండర్లో నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 12వ తేదిని రాష్ట్రంలోని పాఠశాలలకు చివరి పనిదినంగా అమలు చేయనుంది. ఏప్రిల్ 13 నుండి మే 31 వరకు బడులకు వేసవి సెలవులుగా ప్రకటించింది. తిరిగి జూన్ 1 నుండి తిరిగి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.