ఆంధ్రాబ్యాంకు వద్ద అర్థరాత్రి హైటెన్షన్! : ఉలిక్కిపడ్డ స్థానికులు..
సికింద్రాబాద్ లోని చిలుకలగూడ పరిధిలో ఉన్న పద్మారావు నగర్ ఆంధ్రాబ్యాంకు వద్ద అర్థరాత్రి అలజడి రేగడంతో స్థానికులంతా ఉలిక్కిపడ్డారు.
సికింద్రాబాద్: సామాన్యుల నోట్ల కష్టాలతో బ్యాంకులన్ని జనజాతరను తలపిస్తున్నాయి. చేతిలో డబ్బు లేని చాలామంది.. తెల్లారితే చాలు బ్యాంకు ముందు కట్టడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి తరుణంలో.. బ్యాంకు వద్ద సెక్యూరిటీ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటిది అర్థరాత్రి బ్యాంకు వద్ద అలజడి రేగినా... బ్యాంకు సిబ్బంది మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా సికింద్రాబాద్ లోని చిలుకలగూడ పరిధిలో ఉన్న పద్మారావు నగర్ ఆంధ్రాబ్యాంకు వద్ద ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బ్యాంకు వద్ద అర్థరాత్రి అలజడి రేగడంతో స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. చాలాసేపు బ్యాంకు అలర్ట్ సైరన్ నిరంతరాయంగా మోగుతూనే ఉండడంతో.. ఏం జరిగిందో అర్థంగాక స్థానికులు భయాందోళనకు లోనయ్యారు.
కొంతమంది స్థానికులు హుటాహుటిని బ్యాంకు వద్దకు చేరుకుని సెక్యూరిటీని ఆరా తీయగా.. సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు సెక్యూరిటీ. ఇదే విషయాన్ని బ్రాంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఇదంతా మామూలేనని వారు అభిప్రాయపడడం గమనార్హం. దీంతో విషయంపై చిలుకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు స్థానికులు.
అనంతరం నైట్ డ్యూటీ క్త్రెం ఎస్సై వెంకటాద్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. గతంలో తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంఫిల్లింగ్ సెంటర్ సిబ్బంది 9 కోట్లు దోపిడికి పాల్పడినప్పుడు కూడా పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగదు లావాదేవీలతో బ్యాంకులు కిక్కిరిసిపోతున్న తరుణంలో.. ఇలాంటి వ్యవహారాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బ్యాంకు లాకర్లలో ఉన్న సొమ్ము, నగదు విషయంలో ఏదైనా జరిగితే పరిస్థితేంటని నిలదీస్తున్నారు.