కరోనా:వలసకూలీలకు వాడపల్లి చెక్పోస్ట్ వద్ద బ్రేక్, పర్మిషన్ లేదని ఆపిన సిబ్బంది, కూలీల ఆందోళన
వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. సొంత రాష్ట్రం వెళ్లాక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏపీ సరిహద్దు అధికారులు ఉల్లంఘించారు. తెలంగాణ నుంచి ఏపీ వెళ్తోన్న వలసకూలీలను అడ్డుకున్నారు. రాష్ట్రంలోకి వచ్చేందుకు తమకు అనుమతి లేదని.. పర్మిషన్ వచ్చాక వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. కానీ వలసకూలీలు మాత్రం తమను అలో చేయాలని ఆందోళన చేపట్టారు.
హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లేందుకు కూలీలు బయల్దేరారు. వాడపల్లి చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నాక సమస్య తలెత్తింది. ఏపీలోకి వెళ్లేందుకు అధికారులు అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు అనుమతించేందుకు తమకు అధికారం లేదని సిబ్బంది చెప్పారు. పై అధికారుల నుంచి పర్మిషన్ వస్తే అలో చేస్తామని చెప్పారు. కానీ కూలీలను నిలిపివేయడంతో ఆందోళనకు గురయ్యారు.
వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఆందోళనపై నల్గొండ జిల్లా కలెక్టర్ స్పందించారు. చెక్ పోస్ట్ వద్దకు వైద్యాధికారులను పంపించారు. కూలీలకు స్క్రీనింగ్ చేసి.. పంపిస్తామని చెప్పారు. అప్పటివరకు కూలీలకు భోజనం, వసతి కల్పిస్తామని కలెక్టర్ కార్యాలయ అధికారులు స్పష్టంచేశారు. కానీ కేంద్ర హోంశాఖ ఆదేశాలను కూడా ఏపీ అధికారులు ధిక్కరిస్తున్నారని.. వలసకూలీలు వాపోయారు.