lockdown:కంది వద్ద వలసకూలీల ఆందోళన, పోలీసు వాహనంపై దాడి, గాయపడ్డ ఏఎస్సై..
లాక్డౌన్ వేళ దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయిన నేపథ్యంలో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళతామని భీష్మించుకొని కూర్చొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ వద్ద ఇతర రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తున్నారు. ఎలక్ట్రిషీయన్, టెక్నికల్ విభాగంలో 1600 మంది సిబ్బంది ఉన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల వీరిని కంపెనీ రావొద్దని కోరిందని తెలుస్తోంది. నెలరోజుల నుంచి తమను ఒకే గదిలో బంధించారని... సరైన వసతులు... తినడానికి తిండి కూడా లేదని వాపోయారు.
ఇక్కడ ఉండి చేసేదేమీ లేదని.. సొంత రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రహదారిపై ఆందోళనకు దిగారు. ఒకేసారి చాలామంది రావడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కూలీలతో మాట్లాడి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆగ్రహాంతో ఉన్న వారు వినిపించుకోలేదు. పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. కూలీల దాడిలో ఎఎస్సై సంగన్న తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Recommended Video
పోలీసు వాహనంపై కూలీలు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనాస్థలానికి అదనపు బలగాలను మొహరించారు. అక్కడికి కలెక్టర్, ఎస్పీ చేరుకున్నారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ వల్ల సొంత రాష్ట్రం పంపించడం కుదరదని.. ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. కానీ కూలీలు మాత్రం తమను అందరినీ ఓకే గదిలో బంధించారని, ఆహారం కూడా పెట్టడం లేదు అని పేర్కొన్నారు. చాలామంది కార్మికులు రోడ్డుమీదకు రావడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది.