ప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలు
Recommended Video
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ వైఫల్యంతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ను తాకింది.
ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశం
ప్రగతి భవన్ ముట్టడికి యత్నం .. విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ ..విద్యార్థులు అరెస్ట్
ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్ధి సంఘాలు యత్నం చేశాయి. సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశాయి. అంతే కాకుండా సీఎం క్యాంపు కార్యాలయంవైపు చొచ్చుకుపోయే యత్నం చేసిన విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు , విద్యార్ధి సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇంటర్ బోర్డు నుండి ప్రగతి భవన్ కు చేరిన నిరసనలు .. ఆందోళన అణిచే యత్నం చేస్తున్న పోలీసులు
నిన్నటివరకూ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. వీరందరినీ పంజాగుట్ట రాజీవ్ గాంధీ విగ్రహం వద్దే అడ్డుకున్న పోలీసులు బలవంతపు అరెస్ట్ లకు పాల్పడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే, ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ లు చేయిస్తోందని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.
ఇంటర్ బోర్డు వద్ద మూడంచెల భద్రత .. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తగ్గని ఆందోళన
ఇదిలావుండగా ఇంటర్ బోర్డ్ వద్ద నేడు సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ పోలీసుల పహారా కొనసాగుతోంది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అనుమతించడం లేదు. ఇంటర్ ఫలితాల అంశం రాజకీయ రంగును పులుముకుంది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతుంటే, విద్యార్థులను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు .