కేపీహెచ్బీలో భూ ప్రకంపనలు?: పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయనే వదంతులు వ్యాప్తి చెందడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
మంగళవారం రాత్రి సుమారు 8గంటల సమయంలో జేఎన్టీయూ రోడ్డు ఉన్న 18అంతస్తుల మంజీరా ట్రినిటీ కార్పొరేషన్ భవనంలోని 8వ అంతస్తులో ప్రకంపనలు వచ్చాయంటూ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయభ్రాంతులకు గురై కిందికి పరుగులు తీశారు. రేడియో మిర్చి కార్యాలయం నుంచి కూడా ఉద్యోగులు కిందికి పరుగులు పెట్టారు.
ఆ తర్వాత 15, 16 అంతస్తులలో కూడా ప్రకంపనలు వచ్చాయంటూ పలువురు ఉద్యోగులు కిందకి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భవనం సెక్యూరిటీ సిబ్బంది.. ప్రకంపనలు రావడం అంతా పుకార్లేనని, వీటిని ఎవరూ నమ్మవద్దని తిరిగి ఉద్యోగులను భవనంలోకి పంపారు.
ప్రకంపనల సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహేష్.. ఆ భవనం వద్దకు చేరుకుని విచారించారు. పరిసరాలను పరిశీలించారు. భవనంలో ప్రకంపనలు ఏమీ రాలేదని, అవన్నీ పుకార్లేనని భవన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులుకు తెలిపారు. కాగా, ఇటీవల కూకట్పల్లి ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు చోటు చేసుకోవడం గమనార్హం.