మజ్లిస్ దాడి ఎఫెక్ట్: తెరపైకి సెక్షన్ 8, బాబుకు బలం.. మారుతున్న కాంగ్రెస్ స్వరం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటి వెంట 'సెక్షన్ 8' వచ్చింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి, ఎంబిటి నాయకులు, అభ్యర్థుల పైన మజ్లిస్ దాడి చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. పాతబస్తీతో మజ్లిస్ పార్టీ దాడి విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి టిడిపి, కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీ నేతలు వచ్చారు.
ఈ సందర్భంగా వారి భేటీలో సెక్షన్ 8 అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు బాబుపై దుమ్మెత్తిపోశారు.
ఇప్పుడు పాతబస్తీలోని ఘటన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలే సెక్షన్ 8 అంశాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్ నరసింహన్ను కలిసి పాతబస్తీ దాడి ఘటనపై అఖిల పక్ష నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం, మతం అండతో దాడులకు పాల్పడటం విచారకరమన్నారు. తాము ఈ దాడి విషయమై రాష్ట్రపతిని, ప్రధానిని కలుస్తామని చెప్పారు. సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలుస్తామని చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ఆరోపించారు. టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఈసీ పట్టించుకోలేదన్నారు. సాయంత్రం జిహెచ్ఎంసి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలపై నగర కమిషనర్ చర్యలు తీసుకోవాలని టిటిడిపి చీఫ్ ఎల్ రమణ అన్నారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. పరిస్థితి ఇలాగే ఉంటే శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. గతంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సెక్షన్ 8 కోసం డిమాండ్ చేయగా.. ఆ వాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానిని ప్రస్తావించింది.
గవర్నర్ చేతిలో సెక్షన్ 8 ఉందని, పరిస్థితి అదుపు తప్పితే దానిని అమలు చేయాలని కోరుతామన్నారు. అధికార పార్టీ విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని అఖిల పక్ష నేతలు మండిపడుతున్నారు. పోలీసులు నిన్నటి ఘటనలో ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. జరుగుతున్న అరాచకాల పైన ప్రజలు ఆలోచించాలన్నారు. ఘటన పైన ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.