మజ్లిస్పై ఏకం, సెక్షన్ 8: 'టిఆర్ఎస్ విఫలం, గవర్నర్ చేతిలోకి తీసుకోవాలి'
హైదరాబాద్: పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడి విషయంలో విపక్షాలు ఏకమయ్యాయి. విపక్షాలు అన్నీ ఇలా ఏకం కావడం చాలా అరుదు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ దాడి విషయమై బిజెపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీలు ఏకమయ్యాయి. అంతేకాదు, సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, సెక్షన్ 8 అమలు చేయాలని వారు గవర్నర్ నరసింహన్ను కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సెక్షన్ 8 కోసం అడుగుతున్నట్లు వారు చెప్పారు. గతంలో ఓటుకు నోటు సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్ 8 కోసం డిమాండ్ చేశారు.
అప్పుడు తెలంగాణ టిడిపి నేతలు తప్ప అందరూ చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీ నేతలు చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ దాడి నేపథ్యంలో వారే సెక్షన్ 8 కోసం డిమాండ్ చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
హైదరాబాదులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8పై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతలు లేవన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
పాతబస్తీలోకి ఎందుకు వచ్చావని ఓ ప్రజాప్రతినిధి ప్రశ్నించాడని, ఆ ప్రాంతం ఏమైనా అసదుద్దీన్ జాగీరా అని మండిపడ్డారు. అతని తాతలు అతనికి రాసిచ్చారా అన్నారు. శాంతిభద్రతలు క్షీణించినప్పుడు సెక్షన్ 8 అమలు చేయాలని చట్టంలో ఉందని, 144 సెక్షన్ అమలులో ఉండగా ఓ ప్రజాప్రతినిధిపై హత్యాయత్నం దారుణమన్నారు.
దోషిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఎంపీ దౌర్జన్యంగా విడిపించుకొని వెళ్లడం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. పాతబస్తీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ప్రభుత్వం బెయిలబుల్, పెట్టీ కేసులు పెట్టడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెరాస ప్రభుత్వం విఫలమైందని, గవర్నర్ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో జరిగిన ఘటనను తేలిగ్గా తీసుకుంటే హైదరాబాదులో మరిన్ని తీవ్రమైన ఘటనలు జరిగే అవకాశముందన్నారు.
అందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ను శాంతిభద్రతలు అదుపులోకి తీసుకోవాలన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు ముక్తకఠంతో డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.