పాతబస్తీలో దాడి: మజ్లిస్ని ధీటుగా ఎదుర్కొన్నది కిరణ్ కుమార్ రెడ్డేనా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పాతబస్తీలో మంగళవారం నాడు చివరి నిమిషంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. మజ్లిస్ పార్టీ తీరు పైన అన్ని పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దాడికి కారకులైన మజ్లిస్ పార్టీ నేతలను అరెస్టు చేయాలని, అసదుద్దీన్ పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలు - పాతబస్తీలో మజ్లిస్ దాడి నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఇటీవలి కాలంలో మజ్లిస్ పార్టీకి ముకుతాడు వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి అతడేననే చాలామంది భావిస్తున్నారు.
పాతబస్తీలో మజ్లిస్ హవా గురించి చెప్పవలసిన పని లేదు. అయితే, వారు ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. మజ్లిస్ పార్టీ రౌడీయిజానికి పాల్పడుతుందని తాము ఎన్నోసార్లు చెప్పామని, ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు తెలిసి వస్తోందని బిజెపి చెబుతోంది.
బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ను తామే (కాంగ్రెస్) పెంచి పోషించామని, అందుకు తమకు తగిన బుద్ధి చెప్పారని, ముఖ్యమంత్రి కెసిఆర్ మజ్లిస్ మద్దతుపై పునరాలోచన చేయాలని సూచించారు. మజ్లిస్ మద్దతు అంటే పాముకు పాలు పోసినట్లేనని హెచ్చరించారు.
ఏ సీఎం కూడా కిరణ్ కుమార్ రెడ్డిలా మజ్లిస్ పార్టీని అణచలేకపోయారని రాజకీయ నేతల్లో చర్చ సాగుతోంది. మజ్లిస్ పార్టీకి పోటీగా ఎంబీటీ పాతబస్తీలో వేళ్లూనుకోవాలని చూసినా అది కుదరలేదు. చంద్రబాబు హయాంలో ఎంబీటీ ఎదగాలని భావించింది. కానీ అది జరగలేదు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మజ్లిస్ పార్టీకి ఎదురేలేకుండా పోయిందని చాలామంది భావిస్తారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన దాడితో పాటు మజ్లిస్ పార్టీ ఏం చేసినా కాంగ్రెస్ నాడు ఏం చేయలేకపోయిందనే వాదనలు ఉన్నాయి.
అయితే, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వారిని ధాటిగా ఎదుర్కొన్నారనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. మజ్లిస్ పార్టీ తీరు పైన ఆయన కఠినంగానే వ్యవహరించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి వారు దూరమయ్యారని అంటున్నారు.
అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిలువరించారని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, కెసిఆర్ మాత్రం వారిని అదుపు చేయడంలో విఫలమవుతున్నారని ఇప్పుడు విపక్షాలు మండిపడుతున్నాయి.