రాత్రి విచారించి, రేపటికల్లా తేలుస్తాం: పాతబస్తీ ఘటనలో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ పైన దాడి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు డిసిపి సత్యనారాయణ బుధవారం తెలిపారు. నిందితులను ముసియుద్దీన్, హబీబ్, కశ్యప్లుగా గుర్తించినట్లు చెప్పారు.
హబీబ్ ఓల్డ్ మలక్ పేటకు చెందిన వ్యక్తి అని, అతని వయస్సు 21 ఏళ్లు అని చెప్పారు. కశ్యప్ కారు తలుపు తీసి నేతల పైన దాడికి పాల్పడ్డారని, వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పరు. హబీబ్, కశ్యప్ ప్రధాన పాత్రదారులన్నారు.
Photos : కాంగ్రెస్ నేతల ధర్నా
ముసియుద్దీన్ కాలాపత్తాకు చెందిన వ్యక్తి అని, అతను సియాసిత్ జర్నలిస్టును కొట్టాడని చెప్పారు. అరెస్టైన వారిని ఈ రోజు విచారిస్తామని, రేపటి కల్లా ఎవరు ఈ ఘటనకు సూత్రధారులో తేలుతుందని చెప్పారు. దాడికి గల కారణాలు విచారణలో తేలుతాయన్నారు.
ఈ రోజు రాత్రి విచారించి తెలుసుకుంటామన్నారు. నిందితులను దక్షిణ మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్బరుద్దీన్ పైన రెండు కేసులు నమోదయినట్లు చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తే.. విచారణలో నిజాలు తేలాక తదుపరి చర్యలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
గవర్నర్, ఈసికి అఖిల పక్షం ఫిర్యాదు
పాతబస్తీలో మజ్లిస్ దాడి ఘటన పైన అఖిల పక్షం నేతలు (బిజెపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం) గవర్నర్ నరసింహన్, ఈసీని కలిశారు. వారికి దాడిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల పక్షం నేతలు మాట్లాడారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తాము కోరినట్లు చెప్పారు. పాతబస్తీలోని మూడు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలన్నారు. మజ్లిస్ దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోయిందని ఆరోపించారు.
అసదుద్దీన్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని అఖిల పక్షం నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాలని తాము గవర్నర్కు విజ్ఞప్తి చేశామన్నారు.