గ్రేటర్ మేయర్ పీఠం... టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు...? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు..?
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 102ను ఆ పార్టీ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై స్పందించారు. ఫలితాల అనంతరం ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీ తమను సంప్రదించలేదని చెప్పారు. టీఆర్ఎస్కు మద్దతుపై తమ పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్కు ఓట్లు ఎందుకు తగ్గాయో ఆ పార్టీనే అడగాలని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించడం తాత్కాలికమేనని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీడీపీ,వైసీపీ,వామపక్ష,ఇతరత్రా పార్టీలు ఉనికిని కోల్పోవడంతో.. వాటి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం బీజేపీకి దక్కిందన్నారు. గ్రేటర్లో తమకు దక్కిన సీట్ల పట్ల సంతృప్తిగా ఉన్నామని... తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.
కాగా,గ్రేటర్ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. టీఆర్ఎస్ 55,బీజేపీ 48,ఎంఐఎం 44,కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే మేయర్ పీఠానికి కావాల్సిన సంఖ్యా బలం 102 ఎవరికీ లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్కు 38 ఎక్స్అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..? అన్న చర్చ తెర పైకి వచ్చింది.
ఎంఐఎం సొంతంగా 44 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను సంప్రదించవచ్చు. అదే జరిగితే ఒకవేళ ఎంఐఎం తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని పట్టుబట్టవచ్చు. ఒకవేళ చెరో రెండేళ్లు మేయర్ పదవిని పంచుకుందామని ఎంఐఎం ప్రతిపాదిస్తే మాత్రం టీఆర్ఎస్కు ముందు నుయ్యి,వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ మేయర్ అభ్యర్థి ఎన్నిక జరిగే రోజు ఎంఐఎం ఓటింగ్కి దూరంగా ఉండి పరోక్షంగా టీఆర్ఎస్కు సహకరించినా అధికార పార్టీ విమర్శలను తప్పించుకోలేదు.
మతతత్వ పార్టీ అని తమను విమర్శించే టీఆర్ఎస్... మతతత్వ ఎంఐఎంతో ఎలా పొత్తు పెట్టుకుంటుందనో,ఆ పార్టీ సహకారం ఎందుకు తీసుకుందనో బీజేపీ నిలదీస్తుంది. ఇప్పటికే హిందువుల ఓట్లను ఏకం చేయడంలో సఫలమైన బీజేపీకి అది మరో అస్త్రాన్ని అందించినట్లవుతుంది. కాబట్టి ఈ విషయంలో టీఆర్ఎస్ ఎలాంటి అడుగువేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.