పీఏసీ చైర్మన్గా అక్బరుద్దిన్ ఓవైసీ... ప్రధాన ప్రతిపక్షం హోదాను కాంగ్రెస్ కోల్పోవడంతో....
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ఐఎమ్కు దక్కింది. ఎమ్ఐఎమ్ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎమ్ఐఎమ్ కోరుతోంది. దీంతో తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలోనే నిర్ణయం వెలువడింది.
శాసన సభలో ప్రజా పద్దుల కమిటి (పీఏసీ) క్యాబినెట్ హోదాతో కొనసాగుతోంది. సాధరణంగా ఈ కమిటీకి చైర్మన్ను ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన అధినేత సూచనలతో పీఏసీ చైర్మన్ను అసెంబ్లీ ప్రకటిస్తుంది. అయితే తెలంగాణ అసెంబ్లీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం 12 మంది ఇటివల టీఆర్ఎస్లో విలీనమైన విషయం తెలిసిందే... దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కొల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
అయితే ప్రస్తుత సభలో కాంగ్రెస్కు ఆరుగురు సభ్యులు ఉండగా ఎమ్ఐఎమ్కు ఏడుగురు సభ్యులు ఉన్నారు. దీంతోపాటు తమకు పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వాలని ఎమ్ఐఎమ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రధాన ప్రతిపక్షం హోదను కాంగ్రస్ కోల్పోవడంతో పీఏసీ చైర్మన్గా అక్బరుద్దిన్ ఓవైసీని ప్రకటించారు. అలాగే అంచనాల కమిటీ చైర్మన్గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున సీఎం కేసిఆర్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.