ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే నియామకం పట్ల రాజాసింగ్ అభ్యంతరం, సంచలన నిర్ణయం
హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్టం చేసారు. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు.
నిజాం ఫాలోవర్, మజ్లిస్ ఫాలోవర్ అయిన కేసీఆర్ గత రాత్రిపూట మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేను మూడు రోజుల పాటు ప్రొటెం స్పీకర్గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, రాత్రి పూట నిర్ణయం తీసుకున్నారని ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అదే జరిగితే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదని, మజ్లిస్ ప్రొటెం స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేసేది లేదన్నారు.
ఏ పార్టీ వారు, ఎవరెవరు వెళ్లి ప్రమాణం చేస్తారో నాకు తెలియదని, నేను మాత్రం ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. వారు భారత్ మాతాకీ జై అనరని, వందేమాతరం పాడనని చెబుతారని, అలాంటి వారు ప్రొటెం స్పీకర్గా ఉంటే నేను వారి ఆధ్వర్యంలో ఎలా ప్రమాణం చేస్తానని ప్రశ్నించారు.
ఈ నెల 16వ తేదీన మజ్లిస్ నుంచి గెలిచిన ముంతాజ్ గవర్నర్ భవన్లో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేస్తారని, 17న ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, ఈ మేరకు కేసీఆర్ నిర్ణయించారన్నారు. కేసీఆర్ నిర్ణయం అదే అయితే, మజ్లిస్ ఎదుట నేను ప్రమాణం చేయనని, ఇది తన నిర్ణయమని చెప్పారు. దీనిపై పునరాలోచించుకోవాలన్నారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదన్నారు.