నాది ప్రజా ఎజెండా.. ఫామిలీ ఎజెండా కాదు..! అందరికి చెప్పే పార్టీ మారతా..! జగ్గారెడ్డి సంచలనం..!!
హైదరాబాద్ : టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటి నుంచి తాను రాజకీయాలను చాలా దగ్గరగా గమనిస్తున్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అప్పుడు స్వయంగా వైయెస్ రాజశేఖర్ రెడ్డి నన్ను కాంగ్రెస్ లో చేరిపోవాల్సిందిగా అడిగారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. నియజకవర్గ అభివృద్ధి కోసం తాను ఆనాడు కాంగ్రెస్ లో చేరి పోవాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావు పై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు. సంగారెడ్డిలో500 ఎకరాలు భూమి అందుబాటులో ఎక్కడవుందో చూడమని వైయెస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తనని పురమాయించారని, ఎంతోమంది నాయకులు ఐఐటీ కోసం ప్రయత్నం చేసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంగారెడ్డికే ఐఐటీ కేటాయించారని, అందులో తన ప్రమేయం గురించి అందరికి తెలుసని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.
భూమి అందుబాటులో ఉన్నదని చెప్పగానే, అక్కడి రైతులనుండి భూమి సేకరించి, వారకే దాదాపు 2000వేలకు పైగా ఉద్యోగాలు కల్పించగలిగామని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థ రావడం వల్ల సంగారెడ్డి అభివృద్ధి జరిగిందని, తాను తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో కేవలం ప్రజల అజెండా ఉంటుందని, తాను ఎప్పుడు పార్టీ మారినా ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల కోసం మాత్రమే మారతానని, తనను ఇప్పుడు పార్టీ మరమని ఎవ్వరూ అడగటం లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు పార్టీ మారాలని అనుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు. తాను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటానో తనకే తెలియదని, బీజేపీ ఏబీవీపీ విద్యార్థి సంస్థ నుండి తన ప్రస్థానం ప్రారంభం అయ్యిందని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో కూడా తనకు సంబంధాలు ఉన్నాయని, ప్రజల కోసం తాను తీసుకునే నిర్ణయాల వల్లే తనకు ఎనలేని పేరొచ్చిందని తెలిపారు. అందుకే తన ఎజెండా ప్రజల అజెండా అని, ఫ్యామిలీ అజెండా తనకు ఉండదని తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.