మోడీల కోసమే మోడీ... పేదల కోసం కాంగ్రెస్: రాహుల్ నోట కొత్త పథకం
హైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ నీరవ్ మోడీ, మాల్యాలాంటి బడాబాబులు జేబులో డబ్బులు నింపారని కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి పార్టీ అని చెప్పారు. పేదవాడు ఎక్కడున్నా సరే తమ ప్రభుత్వం వెతికి మరీ డబ్బులు వేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక కనీస ఆదాయం కంటే తక్కువగా ఏ ఒక్క వ్యక్తికి ఉండేందుకు వీలు లేదని ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకుంటుందని చెప్పారు.
కొంత కాలంగా రాహుల్ గాంధీ పేదలకు కనీస ఆదాయ పథకాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. శంషాబాద్ సభలోనూ ఈ విషయాన్ని రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతులకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ద్వారా ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తుండటంతో దీనికి ధీటుగా దాదిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలపై రాహుల్ గురిపెట్టారు. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయ పథకాన్ని వర్తింపచేస్తామని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది. వివిధ పథకాల కింద అందుతున్న సబ్సీడీల మొత్తానికి మరికొంత అదనంగా కలిపి ప్రతీ కుటుంబానికి ప్రతీ నెల ఆదాయం కింద వచ్చేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే అది ఎంత మొత్తం ఇవ్వాలి, ఎంత ఆదాయంలోపు ఉన్నవారికి వర్తింపచేయాలనే అంశంపై కాంగ్రెస్ మేధావులు వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులు
ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో అవినీతిని అరికట్టడం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంతో కోట్లాది కుటుంబాలకు దగ్గర కావొచ్చన్నది రాహుల్ వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న రాహుల్ ప్రధాని మోడీని ధనవంతులుగా కాపలా దారుడిగా ప్రచారం చేస్తూ మధ్య దిగువ మధ్య ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ వేదికగా రాహుల్ ఎలాంటి పథకం ప్రకటిస్తారో అని అన్ని పార్టీలు ఆసక్తిగా చూశాయి. మొత్తానికి పథకం అయితే ప్రకటించారు కానీ ఎంత డబ్బులు వేస్తామనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వకుండానే తన ప్రసంగాన్ని ముగించారు రాహుల్ గాంధీ.