ధర్మపురి: పెరిగిన భక్తుల రద్దీ, స్నానమాచరించిన కేంద్ర మంత్రి దత్తన్న
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో బుధవారం ఉదయం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు పుష్కర స్నానమాచరించారు. పుష్కర స్నానం అనంతరం మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వర్షాలు పడకపోవడం, మహారాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం వల్ల నీటి మట్టం తక్కువగా ఉందని అన్నారు.
ఏపీలోని రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై కూడా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో నివేదిక వచ్చాక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధర్మపురిలో పుష్కరఘాట్లకు భక్తుల రద్దీ పెరిగింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు భారీగా తరలివస్తున్న భక్తులతో ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల సౌకర్యం గుడారాల సంఖ్య పెంచడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండటంతో భక్తులు కాస్తంత ఇబ్బంది పడుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలోని ముల్లకట్ట పుష్కరఘాట్ను అధికారులు మూసివేశారు.
ముల్లకట్ట పుష్కర ఘాట్ వద్ద నీటి సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాట్కు వచ్చే భక్తులను రామన్నగూడెం, మంగపేట ఘాట్లకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ముల్లకట్ట ఘాట్ మూసివేయడంతో మంగపేట పుష్కర ఘాట్కు భక్తుల తాకిడి పెరిగింది.