రేపు జిల్లాకేంద్రాలలో ఉధృతంగా ధర్నాలు; ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు: మంత్రి ఎర్రబెల్లి
వరి కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగించాలని, రాష్ట్ర రైతాంగం అంతా ఏకమై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.
గ్రామాలలో బీజేపీ కార్యకర్తలను ఉరికించండి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్స్

ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండా ఎగురవేయాలని పిలుపు
జనగామ టిఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. పార్లమెంటులో నిలదీసినా నిగ్గు తేల్చని కేంద్ర వైఖరిపై మండిపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని పేర్కొన్న ఆయన కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు.

కేంద్రం మెడలు వంచే వరకు ఆందోళనలను కొనసాగించాలి
రాష్ట్ర రైతాంగమంతా ఏకం కావాలి. అవసరమైతే దేశ రైతాంగాన్ని కలుపుకుని ఉద్యమించాలి. కేంద్రం రాష్ట్రంపై వివక్షను మానుకునే వరకు, ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు కేంద్రం మెడలు వంచి, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయని కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలను కేంద్రం దిగి వచ్చే వరకు ఆపేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలను కేంద్రం మెడలు వంచే వరకు కొనసాగించాలని మంత్రి ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు.

గురువారం అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు..
గురువారం రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేపట్టాలని, ఈ ధర్నాలలో రైతులంతా పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఎంపీలు నిలదీసినా కేంద్రం దిగి రావట్లేదు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మంత్రులు రా రైస్ మాత్రమే కొంటామని అంటున్నారని తెలంగాణలో రా రైస్ రాదు, కావాలనే బీజేపి తెలంగాణను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో వరి పంట సాగు విపరీతంగా పెరిగిందని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి వరి తప్ప వేరే పంట వేస్తే పండే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. గోదాములన్నీ నిండి ఉన్నాయని మంత్రి తెలిపారు.

టీఆర్ఎస్ ను, తెలంగాణాను అణచి వేసే ప్రయత్నం అందుకే
సీఎం కేసీఆర్ రైతులను వరి వెయ్యొద్దు అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కొనే భాద్యత మాది రైతులు పంట వేయండి అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. ఆ బీజేపీ నాయకులు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. పిచ్చి మాటలు చెప్పి రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. కేంద్రం దిగి వచ్చి యాసంగి వరి ధాన్యం కోనే వరకు వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. దేశంలో బిజెపి తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన మొదటి పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్న ఆయన, ఆ కోపంతోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అణగదొక్కాలనే బీజేపి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.

గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను శవయాత్రలు చేసి దగ్ధంచేయాలి
దేశ వ్యాప్తంగా జరిగిన రైతుల ఆందోళన కారణంగా, 700 మంది రైతులు మరణించిన తర్వాత, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీ రైతు ఇంటి పైనా నల్ల జెండా ఎగరవేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను శవయాత్రలు చేసి దగ్ధంచేయాలని మంత్రి పేర్కొన్నారు . కేంద్ర మంత్రులు తెలంగాణ ను నూకలు తిని బతకమంటున్నారని పేర్కొన్న ఎర్రబెల్లి, వరి ధాన్యం కొనకపోతే కేంద్ర ప్రభుత్వానికే నూకలు తినిపిస్తామంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ తెగువ ఏంటో చూపిస్తామని మంత్రి అన్నారు.

కేంద్రం చూపిస్తున్న వివక్షను తిప్పి కొట్టాలి
తెలంగాణపై కేంద్రం కక్ష సాదింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి 25వేల కోట్ల కోత విధించారు. 15లక్షల పనిదినాలను 10లక్షల పనిదినాలకు కుదించారని ఆరోపించారు. ఇక ఎస్సీ వర్గీకరణ లేదు. కోచ్ ఫ్యాక్టరీ లేదు. బయ్యారం ఉక్కు పక్కన పెట్టారని మండిపడ్డారు. విభజన హామీలను గాలికి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్షను తిప్పికొట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.