మంత్రి ఎర్రబెల్లి కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్లోని ఓ కారు బోల్తా పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం, మండలం చిటూరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. మంత్రి కారు వెనకాల వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు డ్రైవర్ పార్ధసారది, సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటెండర్ తాతారావు, గన్ మెన్ నరేష్, పీఏ శివను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందు కారులో ఉన్నారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది.
శనివారం అర్ధరాత్రి ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.