జనం కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్.. ఇదే నీకు ఆఖరికి గెలుపు... బండి సంజయ్కి ఎర్రబెల్లి వార్నింగ్
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర్శించారు. కార్పోరేటర్గా కూడా గెలవలేని వ్యక్తిని నాలుగుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితో కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. సంజయ్ మూర్ఖుడు అని,అవగాహన లేని మనిషి అని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలతో చిచ్చు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సంజయ్ ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి,ఇదే ఆఖరిసారి అని వ్యాఖ్యానించారు.
కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్..
తెలిసో తెలియకనో తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మారని... ఆ పార్టీని తిప్పికొట్టే రోజు వచ్చిందని అన్నారు. 'కేసీఆర్ను జైలుకు పంపిస్తారా... ఎవరనుకుంటున్నావ్ జైల్లో పెట్టేందుకు... ఆయన తెలంగాణ ఉద్యమకారుడు,తెలంగాణ రాష్ట్రం తెచ్చిన బిడ్డ. ఆయన మీద పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తారా... జనం తీసి కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్...' అని సంజయ్ని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఎంత తవ్వినా కేసీఆర్ వద్ద తప్పులేమీ దొరకవన్నారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్పై కేసులు పెట్టినా జనం ఊరుకోరని హెచ్చరించారు. సంజయ్కి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ఎత్తిపోతలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలన్నారు.
తెలంగాణకు కేంద్రం నుంచి ఏం తెచ్చారు...?
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పగలరా అని బండి సంజయ్ని ఎర్రబెల్లి ప్రశ్నించారు.బీజేపీ నేతలు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చారా అని నిలదీశారు. బండి సంజయ్ ఇలాగే వ్యవహరిస్తే కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని.. ఆయన కేసీఆర్ గురించి మాట్లాడేంత పెద్దవాడు కాలేదని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్..
కరోనా కారణంగానే, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందుగా నిర్వహించాల్సి వచ్చిందన్నారు ఎర్రబెల్లి. మేయర్ ఎన్నికకు ఇంకా 2 నెలల సమయం ఉందన్నారు. మరో వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ సమస్య పూర్తవుతుందని.. ప్రజల కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కొత్తగా గెలిచిన కార్పోరేటర్లతో శుక్రవారం(డిసెంబర్ 18) పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని... రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లోనూ సంజయ్ ఇవే వ్యాఖ్యలు చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఎర్రబెల్లి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.