కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి మాట్లాడారు . పిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు . భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాల్లో కాదు అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం అంటూ పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేశారు మంత్రి ఎర్రబెల్లి .
బండి సంజయ్ ఛలో జనగామలో హైటెన్షన్ .. దాడులు ఆపకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తామని వార్నింగ్
దేశంలో అధికార పార్టీలో ఉన్న నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో సంక్రాంతి పండుగ కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తున్న నేపథ్యంలో స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీలో ఉన్న నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు అంటూ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి కోసం ఆలయాల దాకా ఎందుకు .. అధికారికంగా సమావేశం పెడదాం
ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ అధికారం కోసం ప్రజల మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ప్రజలను మోసగించే మాటలు మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి మీద ఎవరు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారికంగానే సమావేశానికి పెట్టటానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ కు సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజకీయ నాయకులు గౌరవం పెరిగేలా మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు.
తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేసిన ఎర్రబెల్లి
ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. నేతలు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు పార్టీల తీరును, జరుగుతున్న అభివృద్ధిని అన్నిటినీ గమనిస్తూనే ఉంటారన్నారు. సహజంగానే ఏ చిన్న విషయం అయినా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా సరే చాలా సాఫ్ట్ గా విజ్ఞప్తి చెయ్యటం గమనార్హం .