ఈటల- కేసీఆర్.. మద్యలో దయాకర్..! సున్నితమైన అంశంలో సుతిమెత్తగా వేలెట్టిన ఎర్రబెల్లి..!!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే అదే అంశం పట్ల మరింత వివాదం రేపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొన్ని సెన్సిటివ్ వ్యాఖ్యలు చేసారు. గులాబీ జెండాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రశేఖర్ రావే బాసని తేల్చిచెప్పారు. ఈటల రాజేందర్ చేసి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలంగాణ ప్రజానికం భావిస్తోంది. ఈటల వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గాని, సీఎం చంద్రశేఖర్ రావు గాని, పార్టీ ముఖ్య నేతలు ఎవ్వరు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.
ఉద్యమం పీక్ స్టేజ్ లో నడుస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి అప్పుడప్పుడు తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేసారు తప్ప ప్రత్యక్షంగా ఉద్యమంలో ఏరోజూ పాల్గొనలేదు. ఈటల రాజేందర్ మాత్రం మొదటి నుండీ ఉద్యమంలో పని చేసారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాని ఇప్పుడు ఈటల అంశంలో అదికూడా గులాబీ జెండా గురించి ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేసారు.
గులాబీ పార్టీలో అంతర్గత సమస్యలు ముదురుతున్నట్టు తెలుస్తోంది. ఒకరితర్వాత మరొకరు విమర్శలు చేసుకుంటూ టీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం చేకూర్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ మద్య టీఆర్ఎస్ పార్టీలో తాను మొదటి నుంచి ఉన్నానని, తనకు ఎవరు పదవిని బిక్షగా ఇవ్వలేదని ఈటల రాజేందర్ అన్న విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిసో తెలయకో కౌంటర్ ఇచ్చారు. గులాబీ జెండాకు చంద్రశేఖర్ రావు ఒక్కరే బాస్ అని ఎర్రబెల్లి స్పష్టం చేసారు.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, గులాబీ జెండాను చంద్రశేఖర్ రావు ఒక్కరే తయారు చేశారని చెప్పారు. తాను కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి లెటర్ ఇప్పించానని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. సున్నితమైన అంశంలో తల దూర్చిన ఎర్రబెల్లి వ్యాఖ్యలను తెలంగణ ప్రజానికంతో పాటు, ఈటల అనుచరులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..