పదవులను అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదిస్తే పురుగులు పడి చస్తారన్న మంత్రి ఎర్రబెల్లి సంచలనం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ .. మంత్రిగా తన మార్కు పాలన సాగించాలని దూకుడు చూపిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయిన నాటి నుండి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా వరంగల్ జిల్లాలో కార్యచరణ ప్రణాళికను పరుగులు పెట్టిస్తున్న మంత్రి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టామని గ్రామాలకు వచ్చిన నిధులు స్వాహా చేస్తే కష్టం అన్న మంత్రి
ప్రజలు ఇచ్చిన పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదిస్తే పురుగులు పడి చస్తారు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది . వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలోనూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలోనూ గ్రామ సభలో పాల్గొన్న మంత్రివర్యులు గ్రామ సర్పంచ్ లనుద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టామని గ్రామాలకు వచ్చిన నిధులు స్వాహా చేయాలని చూస్తే జీవితాలను నాశనం చేసుకున్న వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.
30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మంత్రివర్యుల హల్చల్
అక్రమ సంపాదన జోలికి వెళ్లకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన గ్రామ సర్పంచులకు హితవు పలికారు.30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న మంత్రి హల్చల్ చేస్తున్నారు. నూతన చట్టం ప్రకారం చెట్లు నరికితే జైలుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచులు కార్యచరణ ప్రణాళికను సవ్యంగా అమలు చేయాలని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదిస్తే పురుగులు పడి చస్తారు అని చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు కారణమవుతున్నాయి.
ఎర్రబెల్లి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు
చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి చిల్లర పనులు అని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.గతంలోనూ పలు సందర్భాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. గీసుకొండ వస్త్ర పరిశ్రమ భూసేకరణపై కోర్టుకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని వారిని ముప్పతిప్పలు పెట్టాలని అధికారులను వేదికమీదే ఆదేశించారు. అది అప్పుడు పెద్ద దుమారమే రేపింది. గీసుకొండ ప్రాంత రైతుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది.
హాట్ టాపిక్ గా మారిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు
అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి తప్పు చేశారని, టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అభివృద్ధి తన చేతిలో ఉంటుందని, ప్రజలు ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహా వ్యాఖ్యలతో మంత్రి ఎర్రబెల్లి ఏదో ఒక హంగామా సృష్టిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు సైతం అటు ప్రతిపక్ష పార్టీ లోనే కాకుండా సొంత పార్టీ నేతలలోనూ హాట్ టాపిక్ గా మారాయి.