మంత్రులైనా మనుషులు మారలే ...? బహిరంగంగా దమ్కీలిస్తున్నారు ... కోర్టుకెళ్తే వేధిస్తారా..!?
Recommended Video
మంత్రులైనా మనుషులు మారలేదు. దమ్కీలు ఇవ్వడం ఆగలేదు. అప్పట్లో లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ కు ఓట్లు వెయ్యకుంటే మీ గ్రామాలను అభివృద్ధి చెయ్యను అని దమ్కి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవాక్కయ్యేలా చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేపట్టిన కాకతీయ మెగా వస్త్రపరిశ్రమ భూసేకరణకు కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టులకు వెళ్తున్నారని పేర్కొన్న మంత్రి అలాంటి వారు దారికి రాకుంటే తిప్పలు పెట్టాలని అధికారులకు చెప్పారు.
ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ తీసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా ?
వస్త్ర పరిశ్రమ పనులను పరిశీలించిన ఎర్రబెల్లి .. భూసేకరణ పై కోర్టుకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వద్దని షాకింగ్ కామెంట్
గీసుకొండ వస్త్ర పరిశ్రమ భూసేకరణ పై కోర్టుకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వద్దని, ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలని షాకింగ్ కామెంట్ చేశారు. భూ సేకరణ పై కోర్టుకు వెళ్లిన వారికి పునరావాస ప్యాకేజీలను వర్తింప చేయకుండా చుక్కలు చూపించాలని మంత్రివర్యులు సభాముఖంగా పేర్కొన్నారు. గీసుకొండ మండలం లో ఏర్పాటు చేయాలనుకున్న వస్త్ర పరిశ్రమకు మొత్తం 1317 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే 90 ఎకరాల కు సంబంధించిన భూమి విషయంలో వివాదం తలెత్తింది. కొందరు కోర్టులకు వెళ్లి ,కేసుల పేరిట వస్త్ర పరిశ్రమ పనులను ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
దారికి రాకుంటే తిప్పలు పెట్టండి అని అధికారులకు సూచన చేసిన మంత్రి ఎర్రబెల్లి
ఇక వారితో చర్చలు జరపాలని, దారికి రాకుంటే ఇబ్బంది పెట్టాలని మంత్రివర్యులు చెప్పడం అటు అధికారులను, ఇటు ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం సరిహద్దులోని వస్త్ర పరిశ్రమను పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టి ఎస్ ఐ ఐ సి ఎండి నరసింహారెడ్డి లతో కలిసి పరిశీలించిన మంత్రి దయాకర్ రావు పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతుల కల్పన 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు భూసేకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన ముగించాలని కలెక్టర్ ను కోరారు. ఇక ఈ సందర్భంగానే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యాయం కోసం కోర్టుకు వెళ్తే వేధిస్తారా అంటూ రైతుల మండిపాటు
అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళితే వేధింపులకు గురి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి అందరి సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల విషయంలో ఏం చేయాలన్నది తమ హక్కని, హక్కుల కోసం పోరాడితే తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.