చిల్లరగాళ్ళతో డిస్కస్ చేసే సమయం మాకు లేదు : బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిల్లర గాళ్లతో మాట్లాడే సమయం తమకు లేదని తేల్చి చెప్పారు . ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 80% హామీలను నెరవేర్చామని , మిగతా హామీలను రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటివరకూ 1,32,899 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి, సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
కేంద్రంలోని బీజేపీ హామీలపై నిప్పులు చెరిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా కేంద్రంలో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ , గ్యాస్ , డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి రికార్డు స్థాయిలో ధరలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు ఎలా అమలవుతాయో చెప్పాలన్నారు.
బీజేపీపై, బండి సంజయ్ పై ఎర్రబెల్లి మండిపాటు
నల్లధనాన్ని వెలికితీసి వందరోజుల్లో ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన బిజెపి ఇప్పటివరకు ఎవరికైనా డబ్బులు వేశారా అని ప్రశ్నించారు. 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక కాలేజీ అడిగితే అది కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను కేంద్రం మోసం చేస్తుందని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ పిచ్చి కూతలు కూస్తున్నాడు
బండి సంజయ్ పిచ్చి కూతలు కూస్తున్నాడు అని మండిపడ్డారు. బీజేపీ నేతల కన్నా దొంగలు నయం అంటూ వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన అభివృద్ధిని మీడియా సాక్షిగా బయటకు చెబుతున్నామని, బీజేపీ చేసినవి ఏమిటో మీడియా ముందు చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు ఎర్రబెల్లి దయాకర్ రావు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి , ఆరేళ్ల కాలంగా నాశనం చేస్తూ వస్తుందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి ... బీజేపీ టార్గెట్ గా వ్యాఖ్యలు
కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు మళ్లించారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా కేంద్రం రాష్ట్రానికి ఏ విధమైన సహాయం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం నల్గొండ వరంగల్ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ది కోసం చీటికిమాటికి భాగ్యలక్ష్మి ఆలయానికి రమ్మని సవాల్ చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయిందని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరిన ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ నుండి బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.