అసెంబ్లీలో భట్టిపై భగ్గుమన్న ఈటెల.. కుదిపేసిన పౌల్ట్రీ రగడ..
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్దం జరిగింది. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సప్లై చేసే మక్కలకు సంబంధించి భారీ స్కామ్ జరిగిందని భట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పలు రంగాలకు చేసిందేమీ లేదని.. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసినవాటినే తమ విజయాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇదే క్రమంలో పౌల్ట్రీ అంశాన్ని లేవనెత్తడంతో మంత్రి ఈటెల భట్టికి ధీటైన సమాధానం ఇచ్చారు.
భట్టి ఏమన్నారు..
టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడితే కాళేశ్వరం తామే నిర్మించామని చెబుతోందని.. కానీ దానిపైన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి,ఆపైన ఉన్న ఎస్సారెస్పీ తాము కట్టిందేనని భట్టి విక్రమార్క అన్నారు. అంతేకాదు,కడెం ప్రాజెక్టు,మిడ్ మానేర్,లోయర్ మానేర్.. రెండూ తాము నిర్మించినవేనని చెప్పారు. ఎస్సారెస్పీ వరద కాలువ కూడా తాము తవ్వించామన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఇప్పటికీ నీటిని పంప్ చేయట్లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సాగునీటి రంగానికి కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఇక విద్యుత్ విషయంలోనూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలపెట్టిన యాదాద్రి,భద్రాద్రి,ఛత్తీస్ఘడ్ పవర్ ప్లాంట్స్ ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పుడు వస్తున్న విద్యుత్ అంతా గతంలో కాంగ్రెస్ పూర్తి చేసిన ప్రాజెక్టుల నుంచే అని చెప్పారు.
హామీలను నెరవేర్చలేదన్న భట్టి
ప్రభుత్వం ఇచ్చిన ఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58లక్షల మంది విద్యార్థులు ఉన్నారని భట్టి చెప్పారు. ప్రతీ బిడ్డకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేర్చలేదన్నారు. నాణ్యమైన విద్య,స్కూళ్లల్లో సరైన మౌలిక వసతులు లేవన్నారు. ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 4లక్షల మంది చదువుతున్నారని.. మరి మిగతా విద్యార్థుల కోసం అవసరమైన రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించరా అని ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలా లేదన్నారు. రైతు బంధు మేమే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. అది ప్రజల సొమ్మేనని గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశంలో ఏ తహశీల్దారుపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చోటు చేసుకోలేదని.. కానీ టీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆ ఘటన.. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు. అది ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు అన్నారు.
భట్టి పౌల్ట్రీ స్కామ్ ఆరోపణలు.. తిప్పికొట్టిన ఈటెల
కొన్ని లక్ష్ల మంది పౌల్ట్రీ రైతుల కోసం ప్రభుత్వం మక్కలు ఇస్తే.. బడా పౌల్ట్రీ ఫార్మర్స్ వాటిని కాజేశారని భట్టి ఆరోపించారు. చిన్న రైతులకు మక్కలు సప్లై చేయలేదని.. దీనిపై ప్రశ్నిస్తే.. చిల్లర విమర్శలు అంటూ తమపైనే మండిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద పౌల్ట్రీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అయితే భట్టి చేసిన ఆరోపణలను మంత్రి ఈటెల తిప్పికొట్టారు.
కాంగ్రెస్ అవగాహనరాహిత్యానికి,బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం అన్నారు. అసలు ఈ అంశాన్ని ఇప్పుడు లేవనెత్తడమేంటని ప్రశ్నించారు. ఏది పడితే అది నమ్మి మాట్లాడితే ఇలాగే అభాసుపాలవుతారని మండిపడ్డారు. భట్టి విక్రమార్క అంతకుముందు స్పీచ్లో పౌల్ట్రీ వ్యాపారి రామిరెడ్డికి లక్షా 24వేల మెట్రిక్ టన్నుల మక్కలు ఇచ్చినట్టు చెప్పారని.. కానీ ఆయనకు ఇచ్చింది 62వేల మెట్రిక్ టన్నుల మక్కలు మాత్రమేనని చెప్పారు. ఎస్ఆర్ హేచరీస్కి 98,500 మెట్రిక్ టన్నుల మక్కలు ఇచ్చినట్టు చెప్పారని.. కానీ ఇచ్చింది 35వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని చెప్పారు.
ఈటెల వివరణ..
ప్రభుత్వం ఇచ్చిన 4లక్షల మెట్రిక్ టన్నుల మక్కలలో 2లక్షలు మెట్రిక్ టన్నులు రైతులకు,మరో 2లక్షల మెట్రిక్ టన్నులు పౌల్ట్రీ ఫెడరేషన్కి అని ఈటెల స్పష్టం చేశారు.రాష్ట్ర పౌల్ట్రీలో ప్రతీ నెలా 90వేల మెట్రిక్ టన్నుల నుంచి 1లక్షా మెట్రిక్ టన్నుల వరకు వినియోగం ఉంటుందని చెప్పారు. ఇందులో 30వేల మెట్రిక్ టన్నులు స్నేహ హేచరీస్కు,15వేల మెట్రిక్ టన్నులు ఎస్ఆర్ హేచరీస్కు,10వేల మెట్రిక్ టన్నులు వెంకటేశ్వర హేచరీస్కు వెళ్తాయన్నారు. అక్కడ తయారైన బ్రీడ్ తిరిగి ఫార్మర్స్కే వెళ్తుందన్నారు. మక్కలపై సింగిల్ పైసా కూడా సబ్సిడీ ఇవ్వలేదని.. 18వేలకు టన్ను చొప్పున విక్రయించామని తెలిపారు. ఎవరికీ ఉచితంగా ఇవ్వలేదని.. వందల కోట్ల స్కామ్ జరిగిందనడం అర్థం లేనిదని ఈటెల కొట్టిపారేశారు.