ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి ఈటెల వార్నింగ్: మరో బడా ఆస్పత్రిపై వేటు
హైదరాబాద్: కరోనా వైద్యం కోసం వచ్చిన రోగుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కరోనాతో జాగ్రత్త.. ఆలస్యం చేయొద్దు..
అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని ప్రజలను మంత్రి ఈటెల కోరారు. కరోనా లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో చేరాలని సూచించారు. కరోనా తీవ్రమైతే ఊపిరాడకుండా చేసి చంపుతుందన్నారు. అందువల్ల ముందే జాగ్రత్తపడాలని అన్నారు. పీహెచ్సీ స్థాయిలో కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.
మానవత్వానికి కళంకంగా మారుతున్న ప్రైవేటు ఆస్పత్రులు..
కరోనా రోగులకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార దృక్పథంతో కాకుండా ఆపన్న హస్తం అందించాలని మంత్రి ఈటెల కోరారు. అయితే, కొన్ని ఆస్పత్రులు అనేక రకాలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తమకు వందలు, వేల ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఆస్పత్రికి వెళ్లగానే రూ. 2లక్షలు డిపాజిట్ చేయండి అనడం, చికిత్స జరగాలంటే రోజుకు రూ. లక్ష కట్టాలనడం.. 15 రోజులు ఉంటే 15 లక్షలు కట్టండి అంటూ వేధింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయన్నారు.
మనిషి చనిపోతే మృతదేహాన్ని అప్పగించడానికి రూ. 4 లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికే ఓ కళంకంగా మారిపోయిందన్నారు. ఇప్పటికే చాలా ఆస్పత్రులపై ఫిర్యాదులు అందాయని, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నియమించిన కమిటీలు అన్నీ పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ పద్ధతి మార్చుకోని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
కరోనా ఖర్చు రూ. 1000 మించదు..
కరోనాకు ఇస్తున్న మందులు 15 పైసల ట్యాబ్లెట్లు, రూ. 10ల ఇంజెక్షన్లే తప్ప వేలాది ఖరీదు చేసే ఇంజెక్షన్లు లేవని మంత్రి తెలిపారు. కరోనా చికిత్స అంతా కలిపితే రూ. 1000లకు మించదని నిపుణుల కమిటీ చెప్పిందని మంత్రి ఈటెల తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రిలో అయినా.. గాంధీ ఆస్పత్రిలో అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో అయినా కరోనాకు ఇచ్చే మందులు ఒకటేనని మంత్రి చెప్పారు.
పరిస్థితి విషమించకముందే ఆస్పత్రిలో చేరితే కరోనాను నయం చేయవచ్చని తెలిపారు. కాగా, హితం అనే యాప్ ద్వారా విశ్రాంత వైద్యులు వైద్య సలహాలు ఇస్తున్నారని, ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు.
Recommended Video
మరో బడా ప్రైవేటు ఆస్పత్రిపై వేటు..
కాగా, అత్యధిక ఫీజులు వసూలు చేసిన బంజారాహిల్స్లోని విరించి ఆస్పత్రిపైనా తెలంగాణ ఆరోగ్య శాఖ మంగళవారం వేటు వేసింది. మంగళవారం రాత్రి నుంచి ఆ ఆస్పత్రిలో కరోనా వైద్యం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఈ ఆస్పత్రిపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే డెక్కన్ ఆస్పత్రిపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతోనే ఈ మేరకు చర్యలు తీసుకుంది.