హరీశ్ రావు అంటేనే తెరిచిన పుస్తకం... నన్ను తిడితే మీకే ఓట్లు తగ్గుతాయి...
'హరీశ్ రావు అంటేనే తెరిచిన పుస్తకం... అది ప్రజలందరికీ తెలుసు.. అలాంటి నన్ను తిడుతున్నారు... అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా... మీకే నాలుగు ఓట్లు తక్కువవుతాయి..' అని మంత్రి హరీశ్ రావు ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు చేసే ఆరోపణలు,సవాళ్లకు తాను భయపడనని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గుండవెళ్లిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హరీశ్ రావు ప్రసంగించారు.
ఈ ఎన్నిక కాలిపోయే మోటార్లు... బాయికాడ మీటర్లు... 24 గంటల ఉచిత కరెంటుకు నడుమ పోటీ అంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు హరీశ్ రావు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటార్లు చూశాం... బీజేపీ వాళ్లు కొత్త విద్యుత్ చట్టంతో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతామంటున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి ఎవరి వైపు ఉండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేట్ చేయబోతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి బిల్లుకు వ్యతిరేకంగా రేపు పోరాటం చేసేది తామేనని అన్నారు. దుబ్బాక ప్రజలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
అంతకుముందు మంత్రి హరీశ్ రావు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కి మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిధుల్లో కేంద్రం వాటాపై చర్చకు సిద్దమా అని బండి సంజయ్కి సవాల్ విసిరారు. మీరే దుబ్బాక వస్తారా... లేక నన్నే కరీంనగర్ రమ్మంటారా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో డబ్బుతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందే కాక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అంతకుముందు బీడీ కార్మికుల పెన్షన్లలో కేంద్రం వాటాపై హరీశ్ రావు బండి సంజయ్కి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న రూ.2వేల పెన్షన్లో రూ.1600 కేంద్రమే ఇస్తోందని బండి సంజయ్ చెబుతుండగా... బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వట్లేదని హరీశ్ రావు తేల్చి చెప్పారు. కేంద్రమే రూ.1600 ఇస్తుందని నిరూపిస్తే... తాన మంత్రి పదవికి,సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే బండి సంజయ్ దుబ్బాక పాత బస్టాండ్ వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు.