మామ చెప్పాడు.. అల్లుడు పాటిస్తున్నాడు.. చేతల్లో హరీశ్ 'కింగ్'
నాయకత్వ లక్షణాల పరంగా చూసుకుంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ కి సరితూగే స్థాయిలో మరే ఇతర పార్టీ లేదు. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతటి మాస్ లీడరో.. ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మంత్రులు కేటీఆర్ కి, హరీశ్ రావుకి కూడా జనంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కేసీర్ లాగే ఒక్క మాటల విషయంలోనే కాదు, చేతల విషయంలోను ఈ ఇద్దరు మంచి ఘనులే.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ మాటల్ని వంద శాతం ఆచరణలో పెడుతూ.. మామకు తగ్గ అల్లుడు అని నిరూపించుకుంటున్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన పల్లె నిద్ర లాగా.. మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టుల నిద్ర చేస్తున్నారు.
'ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటా.. తిండీ, నిద్ర అన్నీ అక్కడే..' ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేసీఆర్ నోట వినిపించే మాటలివి. సరిగ్గా ఇవే మాటల్ని ఆచరణలో పెడుతున్నారు హరీశ్ రావు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల సమీక్షకు హాజరైన హరీశ్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. అప్పటికే పొద్దు పోవడంతో.. ప్రాజెక్టు దగ్గరే నిద్రకు ఉపక్రమించారు.