అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం: సమీక్షలో మంత్రి హరీశ్
హైదరాబాద్: ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మైనింగ్కు సంబంధించి పాత కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తుందన్నారు.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్పోస్టుల నిర్వహణ కఠినతరం చేయాలన్నారు. అవసరమైతే చెక్ పోస్టులను భారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గుర్తించిన మైనింగ్ జోన్స్కు అధికారులు అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. రివర్ సౌండ్కు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుకను ప్రోత్సహించాలి. మిషన్ కాకతీయ కింద గండిపేట చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
గండిపేట చెరువును పునరుద్ధరణకు టెండర్లు పిలిచి పనులను సత్వరమే ప్రారంభించాలన్నారు. రూ. 12 కోట్లతో ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.