భద్రాద్రి రాములొరికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, 40 మందికే అనుమతి..
కరోనా మహమ్మరి ప్రబలడంతో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు భద్రాచలం రావొద్దని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. కానీ పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య శ్రీరాముడి కల్యాణం గురువారం జరగనుంది. పండితులు, ప్రముఖులు సహా భద్రాచలం ఆలయంలోకి కేవలం 40 మందికి మాత్రమే అనుమతించారు.
గురువారం భద్రాచలం శ్రీరాములవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత సంప్రదాయం ప్రకారం సీతారాముడి కల్యాణం చేస్తారు. పండితులు, పట్టువస్త్రాలు సమర్పించే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులతో కలిసి 40 మందికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈసారి భక్తులు లేకుండానే రాములొరి కల్యాణం జరగబోతోంది. ఆలయం వెలుపల కాకుండా.. లోపల కల్యాణ క్రతువు నిర్వహించబోతున్నారు. కరోనా వైరస్ వల్ల భద్రాచలం వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేనందున.. కల్యాణ ఘట్టాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
చైత్ర శుద్ద నవమి పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించారు. దీంతోపాటు సీతారాముడి పెళ్లి కూడా నవమి రోజున జరిగింది. రాముడు జన్మించడం, పెళ్లి రోజు కావడంతో నవమి సందర్భంగా రామాలయాల్లో సీతారాములకు కల్యాణం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో రాములొరి కల్యాణ్యం ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం కరోనా ఎఫెక్ట్ వల్ల సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు.