జూ.ఎన్టీఆర్ మామపై జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం!
నల్గొండ: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిశీలన నిమిత్తం గురువారం వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ ఉద్యోగి పైన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హీరో జూనియర్ ఎన్టీఆర్కు వరుసకు మామ అవుతారని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ విజయ విహార్ అతిథి గృహం నిర్వహణలో నిర్లక్ష్యం చూపించినందుకు సదరు ఉద్యోగిపై కోపం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి వర్షం పడింది. మంత్రి బస చేసిన గదిలోకి నీళ్లు వచ్చి చేరాయి. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మంత్రి బయటకు వెళ్తున్నారు.
ఆ సమయంలో కౌంటర్ వద్ద ఉన్న రిసెప్షనిస్ట్ మోహన రావును నిలదీశారు. తనకు గన్మెన్కు సరైన గదులు ఇవ్వలేదని ఆగ్రహించారు. మెయింటెనెన్స్ సరిగా లేదని కోపగించారు. అయితే, సదరు ఉద్యోగి మోహన్ రావు హీరో జూనియర్ ఎన్టీఆర్కు వరుసకు మేనమామ అవుతారని తెలుస్తోంది.
చెరువులకు సాగర్ నీరు
నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని చెరువులను సాగర్ నీటితో నింపుతామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హాలియా సమీపంలో సాగర్ ఎడమకాల్వ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలోని సూర్యాపేట తదితర ప్రాంతాల్లో నెలకొని ఉన్న తీవ్ర మంచినీటి ఎద్దడిని అరికట్టేందుకుగాను ఎడమకాల్వ ద్వారా తాగునీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నీటి విడుదల జరిగేలా చూస్తానన్నారు.
తాగునీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారని పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 15రోజుల్లో సూర్యాపేట పట్టణాన్ని ప్రజలు ఖాళీ చేయాల్సి వస్తుందన్నారు. పట్టణంలోని బోర్లు, చెరువులు పూర్తిగా ఎండిపోయి ప్రజలకు దాహార్తి తీర్చుకునే పరిస్థితి లేకుండాపోయిందన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోని సాగర్ ఎడమకాల్వ నీటితో పెద్దదేవులపల్లి రిజర్వాయర్, అనాజిపురం శివారుపరిధిలోని జాండ్ల చెరువును నింపుతామన్నారు. అక్కడి నుండి సూర్యాపేట పట్టణానికి తాగునీటిని అందిస్తామన్నారు. ఎడమకాల్వ ఆధునీకరణ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నీటిని ప్రజలకు అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.